Environmental Testing and Research Laboratories Contaminated Water 1024x683 1
ఉదయాన్నే ఒకేసారి 4 లీటర్ల నీరు తాగితే ..
Trinethram News : నేటి జమానాలో అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. కసరత్తులు మొదలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఈ విషయాల్లో పూర్తి అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవనే ఘటన తాజాగా నగరంలో వెలుగు చూసింది. శరీరంలోని విషతుల్యాలను తొలగించుకునేందుకు ఉదయాన్నే 4 లీటర్ల నీరు తాగిన ఓ మహిళకు చివరకు ఊహించని ప్రమాదం ఎదురైంది.
భారీగా నీరుతాగిన కాసేపటికే ఆమెకు తలతిరుగుతున్నట్టుగా కన్ఫ్యూజన్గా అనిపించింది. ఆ తరువాత ఫిట్స్ వచ్చి కింద పడిపోయిన ఆమె చివరకు స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్యులు అసలు సమస్యను గుర్తించారు. రక్తంలో సోడియం శాతం తగ్గి వాటర్ ఇన్టాక్సికేషన్ బారినపడ్డట్టు గుర్తించి ఆ మేరకు చికిత్స అందించారు. ‘‘ఆమెను చూస్తే హైపోనాట్రేమియా బారినపడ్డట్టు అనుమానం కలిగింది. చివరకు పరీక్షల్లో అదే తేలింది’’ అని వైద్యులు తెలిపారు.
శరీరంలో పరిమితికి మించి నీరు చేరడాన్ని వాటర్ ఇన్టాక్సికేషన్ అని అంటారు. దీని వల్ల శరీరంలో వివిధ రసాయనాల సమతౌల్యం దెబ్బతింటుంది. శరీరంలోని అధికంగా చేరిన నీరు కారణంగా రక్తం పలుచబడుతుంది. సోడియం లాంటి కీలకమైన ఎలక్ట్రోలైట్స్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా కణాల్లోకి నీరు చేరి అవి ఉబ్బుతాయి. మెదడు కణాల్లోకి నీరు చేరినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఫలితంగా కన్ఫ్యూజన్, ఫిట్స్ వంటివి వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
నీరు అతిగా తాగితే కడుపులో తిప్పటం, వాంతులు, కడుపు ఉబ్బటం, తలనొప్పి, తలతిరుగుతున్నట్టు ఉండటం. కండరాలు బలహీనంగా అనిపించడం, నొప్పులు, కాళ్లు, చేతులు పొట్ట వాపు వంటి లక్షణాలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. మూత్రం రంగు లేత పసుపులోకి మారుతుండగానే నీరు తాగడం ఆపాలని లేకపోతే వాటర్ ఇన్టాక్సికేషన్ బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గంట నుంచి రెండు గంటల వ్యవధిలో మూడు నాలుగు లీటర్ల నీరు తాగితే ఈ పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు. ఇబ్బంది మొదలైందనిపించగానే నీరు తాగడం ఆపేయాలి. సమస్య తీవ్రమవుతున్నట్టు అనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదిస్తే పరిస్థితి ముదరకుండా ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
