
Husband Attacked Wife : త్రినేత్రం న్యూస్ : కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కోరుట్ల మండలం మాదాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. 8 నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్కు చెందిన వైష్ణవి (19) ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మాదాపూర్లోనే నివాసముంటున్నారు.
హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద పద్ధతిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వైష్ణవి రీల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తోంది. గత కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వేకువజామున 4 గంటలకు వైష్ణవిపై హరిబాబు కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం కుటుంబసభ్యులు చూసేసరికి రక్తపుమడుగులో వైష్ణవి పడి ఉంది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

