RSS chief Mohan Bhagwat : హిందూ కుటుంబాలకు ముగ్గురు పిల్లలు ఉండాలి

TRINETHRAM NEWS

జనాభా క్షీణత సమాజ మనుగడకు ప్రమాదకరమని హెచ్చరిక

బలవంతపు మత మార్పిడులను అడ్డుకుని, ‘ఘర్ వాపసీ‘ని ప్రోత్సహించాలని సూచన

అక్రమ చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి పంపేయాలని డిమాండ్

సమాజంలో వివక్షను రూపుమాపి, ఐక్యంగా ఉండాలని హితవు

Trinethram News : హిందూ సమాజం సంఘటితమై, బలంగా మారాలని, జనాభా క్షీణతను అరికట్టేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. బలవంతపు మత మార్పిడులను నిలువరించాలని, ‘ఘర్ వాపసీ’ ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. మంగళవారం లక్నోలోని నిరాలా నగర్‌లో జరిగిన ఓ సామాజిక సామరస్య కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా భగవత్ మాట్లాడుతూ హిందూ జనాభా తగ్గడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలని, ఇది సమాజ దీర్ఘకాలిక మనుగడకు అత్యవసరమని నొక్కిచెప్పారు. “ఒక కుటుంబంలో సగటున ముగ్గురు కంటే తక్కువ పిల్లలు ఉన్న ఏ సమాజమైనా భవిష్యత్ తరాలలో అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు” అని ఆయన గుర్తుచేశారు. నూతన దంపతులు ఈ బాధ్యతను అర్థం చేసుకోవాలని కోరారు.

బలవంతపు, ప్రలోభాలతో కూడిన మత మార్పిడులకు వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. హిందూ మతంలోకి తిరిగి రావాలనుకునే వారిని స్వాగతించే ‘ఘర్ వాపసీ’ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, వారికి సరైన మద్దతు ఇవ్వాలని అన్నారు. అక్రమ చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, వారిని వెంటనే గుర్తించి దేశం నుంచి పంపించివేయాలని భగవత్ డిమాండ్ చేశారు.

అదే సమయంలో, సమాజంలో ఐక్యత ప్రాముఖ్యతను ఆయన వివరించారు. మనమందరం ఒకే మాతృభూమి బిడ్డలమని, కాలక్రమేణా అలవాటుగా మారిన వివక్షను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అంతర్గత, బాహ్య సవాళ్ల పట్ల అప్రమత్తంగా ఉంటూ హిందూ సమాజం తన గుర్తింపును, భవిష్యత్తును కాపాడుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిక్కు, బౌద్ధ, జైన వర్గాలతో పాటు పలు ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hindu families should have three children

You cannot copy content of this page

Scroll to Top