Trinethram News : గాజాలో హమాస్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ గాజా చీఫ్ మహ్మద్ సిన్వర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మే 14న ఇజ్రాయెల్ బలగాలు గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో సిన్వర్ మృతి చెందాడని కథనాలు వెలువడ్డాయి. ఖాన్ యూనిస్ లోని యూరోపియన్ ఆస్పత్రి కింది భాగంలో కమాండ్ సెంటర్ లో ఉండగా సిన్వర్ను డ్రోన్ దాడితో హతమార్చినట్లు ఇజ్రాయెల్ బలగాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశాయి.
ఆసుపత్రి కింది భాగంలో సొరంగం ఉన్నట్లు వీడియోలో చూపారు. గతంలో ఇస్మాయిల్ హన్యా, మహ్మద్ డెయిఫ్, యాహ్యా సిన్వర్ ను హతమార్చినట్లే తాజాగా మహ్మద్ సిన్వర్ను మట్టుబెట్టినట్లు నెతన్యాహు పార్లమెంట్ లో ప్రకటించారు. 2023 దాడులకు సూత్రధారిగా భావించిన యాహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ గత ఏడాది హతమార్చింది. ఇప్పుడు ఆయన సోదరుడు మహ్మద్ సిన్వర్ కూడా మృతి చెందడంతో హమా్సకు గాజాలో వెన్ను విరిగినట్లైంది.
2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ మెరుపుదాడి ఘటన సూత్రధారుల్లో యాహ్యా ఒకరని ఇజ్రాయెల్ ఆరోపించడం తెల్సిందే. యాహ్యా అనంతరం ఆయన బాధ్యతలను మహ్మద్ చూసుకుంటున్నారు. సిన్వార్ సొంతపట్టణమైన ఖాన్ యూనిస్పై మే 13న ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేసింది. ‘‘వాటి ధాటికి స్థానిక యూరోపియన్ ఆస్పత్రి భూగర్భంలోని హమాస్ కమాండ్ సెంటర్ నాశనమైంది. అందులో ఉన్న సిన్వార్ చనిపోయాడు’’ అని సైన్యం చెబుతోంది. సిన్వార్ మరణాన్ని హమాస్ ధ్రువీకరించలేదు. అయితే మే 13 నాటి దాడిలో ఆరుగురు చనిపోయారని, 40 మంది గాయపడ్డారని గాజా ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


