యాత్ర విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
త్రినేత్రం న్యూస్ : రాజమహేంద్రవరం : ముస్లింలకు హజ్ ఒక పవిత్రమైన తీర్ధయాత్రని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. హజ్ యాత్రకు ఎంపికైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల హజ్ యాత్రితులకు వారికి గోదావరి హజ్ సొసైటీ ఆధ్వర్యంలో నెహ్రూనగర్లోని బిలాల్ షాధీ ఖానాలో మెడికల్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై వారికి నోట్లో చుక్కల మందు వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సౌదీ అరేబియాలోని పవిత్ర నగరమైన మక్కాను సందర్శించడానికి ప్రపంచంలోని నలుమూలల నుండి వెళతారన్నారని అన్నారు.
పవిత్ర నగరమైన మక్కాలోని అల్లాప్ా (కాబా) పవిత్ర తీర్థయాత్ర ఇస్లామిక్ క్యాలెండర్ పన్నెండవ-చివరి నెలలో (జిల్-హజ్) జరుగుతుందన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్ర భావనపై ఆధారపడి ఉంటుందని, అందువల్ల, హజ్ తేదీలు ప్రతి సంవత్సరం భిన్నంగా ఉంటాయన్నారు. విభిన్న సామాజిక ప్రమాణాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది ముస్లింలు ఒకే తెల్లటి వస్త్రాన్ని ధరిస్తే, అది యాత్రికులకు సమానత్వం-సంఫీుభావాన్ని గుర్తు చేస్తుందని, అందరూ సమానులే అన్న భావనను కలిగిస్తుందన్నారు. కాగా మన రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కూటమి ప్రభుత్వం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. నోడల్ అధికారులను నియమించడం, స్పష్టమైన పికప్, డ్రాప్-ఆఫ్ పాయింట్లను ఏర్పాటు చేయడం, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులైన యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సహాయ సేవలు ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తోందన్నారు.
హైదరాబాద్లోని ఎంబార్కేషన్ కేంద్రం సమీపంలో ఏపీ యాత్రికులకు భద్రమైన, పరిశుభ్రమైన వసతి ఏర్పాట్లను తెలంగాణ హజ్ కమిటీతో సమన్వయం ద్వారా చేయాలని, తగిన ప్రాంగణాలను కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పురుషులు, మహిళల కోసం వేర్వేరు వసతి కేంద్రాలు, నాణ్యమైన-ఆరోగ్యకరమైన భోజన వసతి, శుద్ధ తాగునీటి సదుపాయాలు, సేవలందించే సంస్థలను ఎంపిక చేయడం, వాటిపై పర్యవేక్షణ విధానం అమలు చేయడం, విమానాశ్రయ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స, అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడానికి తెలుగు రాష్ట్రాల పర్యవేక్షణ బృందాలు సమన్వయంతో పని చేయనున్నాయన్నారు. ఏపీ నుంచి 1630 మంది హజ్ యాత్రకు ఈ ఏడాది వివిధ దశల్లో హైదరాబాద్, బెంగళూరు ఎంబార్కేషన్ కేంద్రాల నుంచి బయలుదేరుతున్నారని, వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టి వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అబ్దుల్లా, గోదావరి హజ్ సొసైటీ అధ్యక్షులు హబీబ్ బేగ్, గోదావరి హజ్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


