వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తాండూరు పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న గ్యాంగ్ను సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సౌత్ జోన్ పోలీస్ కమిషనర్ చంద్రమోహన్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కస్తూరి రమేష్ బాబు, అబ్దుల్ వహీద్, మొహమ్మద్ సోహైల్, మొహమ్మద్ ఫహాద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, తహా, సయ్యద్ అల్తమాష్ ఉన్నారు. పోలీసుల ప్రకారం..
ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తన సోదరి కె.రామేశ్వరి సహాయంతో తాండూరులోని తన ఇంట్లో నకిలీ నోట్ల ముద్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాండూరు కోకట్ రోడ్లోని నివాసం వద్ద అవసరమైన స్కానర్, కంప్యూటర్, ప్రింటర్, మరియు జె కె బాండ్ పేపర్ వంటి సామాగ్రిని సేకరించి నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించేవారు. నకిలీ నోట్ల తయారీ విధానం ఇలా ఉంది.. ముందుగా అసలు కరెన్సీ నోట్ల ముందు, వెనుక భాగాలను స్కానర్ ద్వారా స్కాన్ చేసి, ఆ చిత్రాలను ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా సవరణలు చేసి, కరెన్సీ పరిమాణానికి సరిపోయేలా సర్దుబాటు చేసేవారు. తరువాత వాటిని జేకే బాండ్ పేపర్పై ముద్రించి, బ్లేడ్ సహాయంతో అసలు నోట్ల సైజ్కి కట్ చేసేవారు. ఈ నకిలీ నోట్లను మార్కెట్లో చలామణి చేయాలని యత్నిస్తుండగా పోలీసులు గోప్య సమాచారం ఆధారంగా దాడి చేసి ముఠాను పట్టుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


