Dollar @ Rs.91 : డాలర్ @ రూ.91

TRINETHRAM NEWS

ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరిన రూపాయి విలువ

రికార్డ్‌ స్థాయిలో పతనమైన రూపాయి విలువ

Trinethram News : అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ పడిపోతుంది. మంగళవారం రూపాయి విలువ మరింత పతనమై ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే మారకపు విలువ 5 పైసలు క్షీణించింది. 91 కు చేరింది. భారత్‌-అమెరికా డీల్‌పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాల వల్లే రూపాయి మారకం విలువ క్షీణిస్తోందని నిపుణులు అంటున్నారు. భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింటోందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌ ఒడుదొడుకులు, డాలర్‌కు డిమాండ్‌ పెరగడం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, త్వరలో 91 మార్క్‌ కూడా దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు : అటు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 25,900 మార్క్‌ వద్ద ఊగిసలాడుతోంది. ఎర్లీ ట్రెడింగ్​లో సెన్సెక్స్‌ 359.13 పాయింట్లు దిగజారి 84,854.23 వద్ద, నిఫ్టీ 105.55 పాయింట్ల నష్టంతో 25,921.75 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, మదుపర్ల అప్రమత్తత సూచీలను ఒత్తిడికి గురిచేస్తున్నాయి.

రూపాయి పతనంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రూపాయి దాని స్థాయిని అదే కనుగొంటుందని వ్యాఖ్యానించారు. రూపాయి బలహీనతను రాజకీయం చేయవద్దని కోరారు. గతంలో తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా రూపాయి పతనం మరింత ఆందోళన కలిగించిందని, ప్రస్తుత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని ఆమె గుర్తుచేశారు.

రూపాయి పతనం ప్రభావం : పాయి పతనం వల్ల చమురు దిగుమతులపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే మన దేశ అవసరాల్లో దాదాపు 85 శాతం చమురు విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెల కోసం కూడా విదేశీ సరఫరాదారులపై ఆధారపడుతోంది. రూపాయి పడటం వల్ల ఈ దిగుమతి బిల్లులు పెరుగుతాయి. ఇక ముడి చమురు దిగుమతుల ఖర్చు పెరిగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయి. ఫలితంగా రవాణా ఖర్చులు భారం అవుతాయి. తద్వారా నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. అంతేకాకండా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులపై కూడా భారం పడుతుంది. 2023తో పోలిస్తే ఏటా అదనంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు, 50,000 డాలర్ల వార్షిక ఫీజు ఒకప్పుడు రూ.80 రూపాయిల దగ్గర రూ.40 లక్షలు అయితే, ఇప్పుడు రూ.90 వద్ద అది రూ.45 లక్షలకు చేరుతుంది. అలాగే చదువు కోసం డాలర్లల్లో లోన్లు తీసుకుంటే ఇప్పుడు చెల్లించాలంటే అధికంగా 12-13 శాతం భరించాల్సి ఉంటుంది. అయితే ఈ రూపాయి సంక్షోభం గతంతో పోలిస్తే ఈసారి భిన్నంగానే ఉంది. 2022 తర్వాత రూపాయికి ఇది అత్యంత నిరాశాజనకమైన సంవత్సరం కానుంది. అప్పుడు డాలర్ బలంగా ఉండటం వల్ల చాలా దేశాల కరెన్సీలు పతనమయ్యాయి. కానీ ఈసారి డాలర్ విలువ స్థిరంగా ఉన్నప్పటికీ రూపాయి క్షీణిస్తోంది. ఇదిలా ఉండగా ఆర్​బీఐ వద్ద ప్రస్తుతం 690 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. గతంలో చమురు ధరలు పెరిగినప్పుడు కూడా ఆ స్థాయిలో నిల్వలు లేవు.

వారికి బెనిఫిటే : అయితే రూపాయి విలువ పతనం ప్రవాసులకు కలిసి వస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్‌లు భారత్‌కు వస్తున్నాయి. ప్రతి నెల 500 డాలర్లు పంపేవారికి, ఇప్పుడు రూ.40,000కు బదులు రూ.45,000 వస్తాయి. అలాగే డాలర్లలో ఆదాయం పొందే ఐటీ, ఫార్మా కంపెనీలకు కూడా ఆదాయాలు పెరుగుతాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dollar @ Rs.91

You cannot copy content of this page

Scroll to Top