అల్లూరిజిల్లా అరకులోయ, డిసెంబర్ 9 (త్రినేత్రం న్యూస్): అంతర్జాతీయ అండర్ 19 క్రికెట్ టీ20 ప్రపంచకప్ 2025 విజయంలో కీలక పాత్ర పోషించిన మన్యం బిడ్డ పాంగి కరుణాకుమారిని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ సోమవారం సత్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరుణాకుమారికి దుస్సాలువా కప్పి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి జిల్లా వంట్లమామిడి గ్రామానికి చెందిన పీవిటీజీ కుటుంబంలో పుట్టిన కరుణాకుమారి అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి కీర్తి తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆమె ప్రదర్శన అల్లూరి జిల్లా ప్రజల మెదళ్లలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
కరుణాకుమారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న కలెక్టర్, ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ పంపినట్లు తెలిపారు. అదేవిధంగా పిఎంజన్మన్ పథకం ద్వారా ఆమె కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని, తాను చదువుకునేందుకు కావలసిన పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చదువులోనూ, క్రీడల్లోనూ మరింత ముందుకు సాగాలని ఆమెను ప్రోత్సహించారు.
కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అంబేద్కర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి కే. ప్రసాద్, కరుణాకుమారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


