అల్లూరిజిల్లా అరకువేలి (బస్కీ): త్రినేత్రం న్యూస్ జూన్ 30 : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం బస్కీ గ్రామం మార్గంలో జరుగుతున్న తారు రోడ్డు నిర్మాణం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా జరుగుతోందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ తీవ్రంగా విమర్శించారు. పిఈయు (ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్) ద్వారా నందిగూడ జంక్షన్ నుండి బస్కీ వరకు 3 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న తారు రోడ్డు పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
బస్కీ ప్రాంతంలో మట్టి ర్యాంపులపై తారు వేయడం వల్ల వర్షాల సమయంలో బురదగా మారి ద్విచక్ర వాహనాల ప్రయాణానికి కూడా అనుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. సీసీ ర్యాంపుల వద్ద మట్టిని త్రవ్వించి అలాగే వదిలేయడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారని ఆయన పేర్కొన్నారు. “కొన్ని నెలల కిందటే వేసిన తారు ఇప్పటికే ఊడిపోతోంది. ఇది పూర్తిగా నాణ్యతా లోపానికి నిదర్శనం. అధికారుల పర్యవేక్షణ లోపంతో గుత్తేదారు ఇష్టరాజ్యంగా పనులు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాడు,” అని బాలదేవ్ ఆరోపించారు.
అధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విజిలెన్స్ శాఖలకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో గిరిజన సంఘం నేతలు ఎస్.ప్రభుదాస్, హరి, చంటి, కొర్రా మత్యరాజు, ధనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


