అరకులోయ ఫిబ్రవరి 11, (త్రినేత్రంన్యూస్): జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3,26,910 మంది పిల్లలు, విద్యార్థులు ఉన్నారని, వీరందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఫిబ్రవరి 24న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, దీనికి ముందుగా ఈ నెల 17న మెప్ అప్ డే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అన్ని విద్యాసంస్థల్లో పంపిణీ … 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ డీ-వార్మింగ్ మాత్రలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, వృత్తి విద్యాసంస్థలు, బాలల సంరక్షణ కేంద్రాలు, బాలసదన్, నర్సింగ్, డిగ్రీ మొదటి సంవత్సరం, పారా మెడికల్, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు, అలాగే బడి బయట ఉన్న పిల్లలందరికీ మాత్రలు పంపిణీ చేయాలని తెలిపారు.
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 6,505 కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు వివరించారు. భోజనం తర్వాత మాత్రలు విద్యార్థులు భోజనం చేసిన తర్వాత మాత్రలు ఇవ్వాలని, వాటిని నమిలి మింగేలా అవగాహన కల్పించాలన్నారు. భోజనం చేసిన అరగంటలోపు మాత్రలు వేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. రక్తహీనత నివారణపై దృష్టి… పోషణ లోపం, రక్తహీనత నివారణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
మండల స్థాయి కమిటీలు …. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీవో, సీడీపీవోలు కలిసి అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించే బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఉంటుందని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్నవారు… ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్, ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్, పీడీ ఐసిడిఎస్ ఝాన్సీరామ్ పాడల్, గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారి పీఎస్ కుమార్, డీఈవో, ఐటిడిఎ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంఈఓలు తదితరులు వీసీ విధానంలో పాల్గొన్నారు. వైద్య శాఖ సిబ్బంది కూడా హాజరయ్యారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


