అరకులోయ ఫిబ్రవరి 24, (త్రినేత్రం న్యూస్): పీఎం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అదనపు లక్ష రూపాయలను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఏ కార్యాలయం వద్ద ‘చలో ఐటిడిఏ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది.
మండలంలోని చినలబుడు పంచాయతీ గొందివలస గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం మండల నాయకులు, తుడుం క్లస్టర్ పెసా కార్యదర్శి ముసిరి మల్లన్న మాట్లాడుతూ పీవీటీజీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం జన్మన్ హౌసింగ్ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన వారికి బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పీవీటీజీలకు యూనిట్కు అదనంగా లక్ష రూపాయలు పెంచినట్లు ప్రకటించి ఏడాది గడిచినా ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వాల్సిన రూ.29 వేల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పీఎం జన్మన్ పీవీటీజీ గ్రామాల్లో 12 రకాల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, ఇళ్ల యూనిట్ ధరను రూ.10 లక్షలకు పెంచాలని, 2.0 సర్వేలో గుర్తించిన ఆదివాసులకు ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 27న పాడేరు ఐటిడిఏ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాలో పీఎం జన్మన్ లబ్ధిదారులు, ఆదివాసులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొర్ర సుబ్బారావు, కొర్ర రాజు, గెమ్మెలి బుజ్జిబాబు, ముసిరి అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


