Awareness of Organic Farming : తంగడపల్లి గ్రామలో ప్రకృతి /సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన
త్రినేత్రం న్యూస్/షాబాద్ ప్రతినిధి… తంగడపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వెల్స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు గ్రామ సర్పంచ్ పామెన రాములు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం వంటి సేంద్రీయ ద్రావణాల తయారీ విధానాలను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ ద్రావణాల వాడకంతో నేల సారాన్ని పెంచడం, పంటల దిగుబడిని మెరుగుపరచడం, రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గించడం వంటి ముఖ్య ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేశారు.
రైతులు అడిగిన అనేక ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతులు ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలను పండించి, అధిక ఆదాయం పొందవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో వెల్స్పన్ ఫౌండేషన్ CSR హెడ్ సురేఖ, అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్, భద్రయ్య రమేష్, విమల, ఉప సర్పంచ్ న్యాలట గోవర్థన్ పాల్గొన్నారు. గ్రామానికి చెందిన అనేక మంది రైతులు సదస్సుకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గ్రామ స్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రైతుల్లో ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం పట్ల చైతన్యం పెంపొందుతుందని, భవిష్యత్తులో మరిన్ని శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

