కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా గణేశశర్మ
Trinethram News : తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరానికి చెందిన రుగ్వేద పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను ఎంపిక చేసినట్లు సంస్థానానికి చెందిన చల్లా విశ్వనాథశాస్త్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో ఆయనకు సన్యాస దీక్ష ఇస్తారని పేర్కొన్నారు.
దుడ్డు ధన్వంతరి, మంగాదేవిల పెద్ద కుమారుడైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రావిడ్ స్వస్థలం కాకినాడ జిల్లా అన్నవరం. తండ్రి అన్నవరం ఆలయంలో మూడు దశాబ్దాలుగా ప్రథమశ్రేణి వ్రత పురోహితుడిగా ఉన్నారు. గణేశశర్మ 1998లో జన్మించారు. 2006లో వేద అధ్యయన దీక్ష తీసుకున్నారు. ద్వారకా తిరుమల ఆలయంలో వేదవిద్యను అభ్యసించారు. రుగ్వేద పండితుడైన గణేశశర్మ యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించిన ఘనాపాటి.
తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేదపాఠశాలలో సేవలందించారు. కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. గణేశశర్మకు దక్కిన అరుదైన గౌరవానికి అన్నవరం క్షేత్రంలోని వ్రత పురోహితులు, అర్చకులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


