Festivals : ఆదివాసీ కి అవసరం లేని ఉత్సవాలెందుకు.

TRINETHRAM NEWS

ప్రజాధనం _ పరులపాలు కి తప్ప

ప్రభుత్వ పని తీరును దుయ్యబట్టిన గిరిజన సంఘం

అల్లూరిజిల్లా అరకులోయ జనవరి 28, (త్రినేత్రంన్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు చలి ఉత్సవాలకు రానున్న నేపథ్యంలో, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. ఆదివాసులకు జల సమాధి తీసుకొచ్చే హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన జీవో నెంబర్లు 2, 13, 51లను తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో 100% ఉపాధ్యాయ పోస్టులకు రిజర్వేషన్ అమలు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాలని, అరకు కాఫీ రైతులకు బెర్రీ బొర్రర్ వ్యాధి వల్ల వచ్చిన నష్టానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
అరకువేలి గిరిజన సంఘం భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలాదేవ్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని అనంతగిరి, అరకువేలి, చింతపల్లి, జీకే వీధి మండలాల్లో గుజ్జెలి, చిట్టంవలస, పెదకోట, ఎర్రవరం, సీలేరు వంటి ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో 6100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి నవయుగ, అదానీ, శిరిడి సాయి ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్, మెగా వంటి కార్పొరేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు.
ఈ ప్రాజెక్ట్ అమలైతే 25 పంచాయితీలు, 250 గ్రామాలు, సుమారు 60 వేల మంది ఆదివాసులు, వేల ఎకరాల జిరాయితీ, అటవీ భూములు, కాఫీ తోటలు, వన్యప్రాణులు జల సమాధి అవుతాయని హెచ్చరించారు. ఆదివాసీ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ ఇచ్చిన జీవోలు 2, 13, 51లను వెంటనే రద్దు చేయాలని స్పష్టమైన ప్రకటనతో ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీ పండించే ఆదివాసీ రైతులకు బెర్రీ బొర్రర్ వ్యాధి వల్ల భారీ నష్టం జరిగిందని, అరకువేలి, డుంబ్రిగూడ మండలాల పరిధిలోని 10 పంచాయితీలు, 38 గ్రామాల్లో 152 ఎకరాల్లో 176 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
మెగా డీఎస్సీ సందర్భంగా ఆదివాసీ ప్రాంతాల్లో 100% ఉపాధ్యాయ పోస్టులకు రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని, దాని వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4500 పోస్టులు ఆదివాసులు కోల్పోయారని, ఒక్క అల్లూరి జిల్లాలోనే 92% జీఓ ఉపాధ్యాయ పోస్టులు నాన్‌లోకల్స్‌తో భర్తీ అయ్యాయని తెలిపారు. 2026 డీఎస్సీకి ముందే 100% రిజర్వేషన్‌పై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయాలని, అప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాల ఖాళీలను జనరల్ డీఎస్సీలో విలీనం చేయవద్దని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి. బుజ్జిబాబు, మండల నాయకులు, మాజీ ఎంపిటిసి బురిడీ దశరథ్, మొద్దు, జగనాథం తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Why are there festivals that are not necessary for the tribals?

You cannot copy content of this page

Scroll to Top