Alluri Walkers Association : చలిగాలులకు వణుకుతున్న ఆదివాసులకు అండగా అల్లూరి వాకర్స్ అసోసియేషన్

TRINETHRAM NEWS

అరకులోయ, డిసెంబర్ 18,(త్రినేత్రం న్యూస్): అల్లూరి వాకర్స్ అసోసియేషన్ సీతమ్మధార వారి సహకారంతో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం బాస్కి పంచాయతీ పరిధిలోని దేవరపల్లి, దుంగ్యపుట్, జంకరవలస గ్రామాల్లో గిరిజనులకు చలిదుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, మండల నాయకులు కె. రామారావు, మాజీ ఎంపీటీసీ బి. దశరథ్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా సుమారు 400 చలిదుప్పట్లు గిరిజనులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో డిసెంబర్ నెలలో తీవ్ర చలిగాలులు వీచి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోతున్నాయని తెలిపారు. ఈ కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, పివిటిజి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, విద్యార్థినులు చలిదుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే పివిటిజి మరియు ఇతర గిరిజనులకు ప్రభుత్వం తక్షణమే ఉచితంగా చలిదుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదని వారు సూచించారు.
అత్యంత కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలతో ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో అల్లూరి వాకర్స్ అసోసియేషన్ వారు సుమారు రూ.50 వేల విలువైన 500 చలిదుప్పట్లు అందజేయడం అభినందనీయమని పేర్కొంటూ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు కె. రామారావు, మాజీ ఎంపీటీసీ బి. దశరథ్, పంచాయతీ నాయకులు కె. మాణిక్యం, కె. రవిశంకర్, పి. బలరాం, ఎస్. నర్సింగరావు, కె. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Alluri Walkers Association extends support to tribal people

You cannot copy content of this page

Scroll to Top