Vyalla Harish Reddy : రామగుండంలో అరాచక పాలన?

TRINETHRAM NEWS

ప్రశ్నిస్తే కేసులు, బెదిరింపులు

రామగుండంకు ఎమ్మెల్యే పార్ట్ టైమా ఫుల్ టైమా తీవ్రంగా విమర్శించిన వ్యాళ్ళ హరీష్ రెడ్డి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల్ల హరీష్ రెడ్డి రామగుండం పరిసరాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణల వర్షం కురిపించిన ఆయన, రామగుండంలో ప్రజాస్వామ్య పద్ధతులు తుంగలో తొక్కబడ్డాయని ఆరోపించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ… రామగుండంకు పార్ట్ టైమ్ ఎమ్మెల్యేనా… ఫుల్ టైమ్ ఎమ్మెల్యేనా..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే కిందిస్థాయి నాయకులు రెచ్చిపోతూ హద్దులు మీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కెసిఆర్ హయాంలో గోదావరి నది నిండుకుండలా ఉప్పొంగేదని, కానీ కాంగ్రెస్ హయాంలో గోదావరి ఎడారిగా మారిపోయిందని విమర్శించారు. బూడిదలో కూడా కమిషన్లు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ పార్టీ ర్యాలీలకు ఆంక్షలు విధిస్తూ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని ప్రశ్నించారు. పోలీసులు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకావద్దని సూచించారు. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు క్వాటర్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని, ఇప్పటి వరకు ఎన్ని క్వాటర్లు కట్టించారో తెలపాలని డిమాండ్ చేశారు. రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లను కూల్చివేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు, వృద్ధులకు పెంచుతామన్న పెన్షన్ ఇప్పటి వరకు పెరగలేదని హరీష్ రెడ్డి ప్రశ్నించారు.

రామగుండంలో అరాచక పాలన కొనసాగుతోందని, హైకోర్టు స్టే ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎవరు మాట్లాడినా.. దాడులకు పాల్పడుతున్నారు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీకి లేదని ఆరోపించిన ఆయన, ఇప్పటి వరకు ఇందిరమ్మ గృహాలు ఎన్ని ఇచ్చారో, రామగుండానికి ఎంత నిధులు మంజూరు చేసారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రామగుండంలో స్కాములు, కూల్చివేతలు తప్ప అభివృద్ధి ఏమీ కనిపించడం లేదు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రైతులకు భరోసాగా కెసిఆర్ ప్రభుత్వం నిలిచిందని, గడచిన 18 నెలలుగా రామగుండంలో అరాచక పాలన కొనసాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు మున్సిపల్ కార్యాలయం వద్ద వ్యాళ్ళ హరీష్ రెడ్డికి బి.ఆర్.ఎస్ నాయకులు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం టీ జంక్షన్లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మార్కండేయ కాలనీ జంక్షన్ లో గల జ్యోతిరావు పూలే విగ్రహాలకు, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. బిఆర్ఎస్ పార్టీ కో ఆప్షన్ మెంబర్ తస్నిమ్ బాను, జాహిద్ పాష, బిఆర్ఎస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు పోలాడి శ్రీనివాస్,బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, నడిపెల్లి సాయి, అల్లి గణేష్, ఉదయ్, కొండా సురేష్, పోయిల రవి, అధిక సంఖ్యలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వ్యాల్లా హరీష్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top