TRINETHRAM NEWS

రేపు శ్రీవారి ప్రణయకలహ మ‌హోత్సవం

తిరుమల :

శ్రీ వేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగారభరితమైన ప్రణయ కలహ మ‌హోత్సవం డిసెంబ‌రు 28వ తేదీ గురువారం తిరుమలలో జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు‌.