
Nagababu : అరకులోయ, జూన్ 30, (త్రినేత్రం న్యూస్): జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, గిరిజన ప్రాంతాల్లో పార్టీ విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోణిదెల నాగబాబు తెలిపారు. అరకులోయలో సోమవారం నిర్వహించిన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రతి మండలం, గ్రామంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
పార్టీ ఆవిర్భావం నుంచి గత 12 సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించడం జనసేన లక్ష్యమని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించేందుకు నాయకత్వం కట్టుబడి ఉందని, నిబద్ధతతో పనిచేసే వారికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని నాగబాబు పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని మరింత పటిష్టం చేస్తున్నామని, అరకు మరియు పాడేరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశాలపై కార్యకర్తల్లో ఉత్సాహం ఉందని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేసి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గిరిజనుల హక్కులను పరిరక్షించే రాజ్యాంగబద్ధ చట్టాలను కాపాడేందుకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు. గిరిజనుల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ, ప్రాంతీయ అభివృద్ధే పార్టీ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
సమావేశంలో పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, రాబోయే రాజకీయ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు. అరకు పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని నాగబాబు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, నిర్మాణ సారథులు, సమాచార సేకరణ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe