TRINETHRAM NEWS

రాష్ట్ర వ్యాప్తంగా “మేము సిద్ధం మా బూత్ సిద్ధం”

47 వేల బూత్ కమిటీల నియామకం పూర్తి

2024 ఎన్నికల్లో 175/175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. 2024 ఎన్నికల్లో 175/175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ కార్యాచరణ పూర్తి చేసింది. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా సిద్ధం పేరుతో భారీ క్యాడర్ మీట్ లు నిర్వహించిన సీఎం జగన్ ఎన్నికలే టార్గెట్ గా మరో కీలక ఘట్టం పూర్తి చేశారు. సాధారణంగా ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన ఈ కార్యక్రమం 50 రోజుల ముందే పూర్తి చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా నిలుస్తోంది. దీంతో సీఎం జగన్ వైఎస్సార్ సీపీని ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీల ముందు నిలిపారు. ఇప్పటికే అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరడంతో సీఎం జగన్ కార్యకర్తల సన్నాహంపై దృష్టి సారించారు. కార్యకర్తలతో సమావేశాల్లో ఇటీవల నిర్వహించిన రాప్తాడు వేదికగా సిద్దం సభకు భారీ స్థాయిలో హాజరైన క్యాడరే నిర్వచనం. అదే సమయంలో వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో సీఎం జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా..

రాష్ర్ట రాజకీయాల్లో ఇంత వరకు ఏ పార్టీ చేయని సాహసం చేసి సీఎం జగన్ కొత్త తరం రాజకీయాలకు దిక్సూచిగా నిలిచారు. అదే వైఎస్సార్ సీపీ పాలనలో ఏపీలో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్. గ్రామ స్థాయిలో వార్డు సభ్యుల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యుల నుంచి మండల అధ్యక్షుల వరకు, జెడ్పీటీసీ సభ్యుల నుంచి జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, క్యాబినెట్ మంత్రుల వరకు 80 శాతం ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి చరిత్ర సృష్టించారు. దీంతో అత్యున్నత పదవులైన ఉప ముఖ్యమంత్రులుగా వెనుకబడిన మరియు అణగారిన వర్గాల నేతలను నిలిపి సామాజిక సమీకరణలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వెనుకబడిన వర్గాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిన పార్టీలకు చెంపచెట్టులా.. సీఎం జగన్ అధికారాన్ని అన్ని వర్గాలకు పంచారు. దీంతో పాటు ప్రత్యక్ష నదగు బదిలీ (DBT) పథకాలలో 80 శాతం ప్రయోజనాలు బడుగు, బలహీన వర్గాలకే అందించారు.
ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీ 68 మంది అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, 16 మంది (25 మందిలో) పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల జాబితాను విడుదల చేయగా అందులో బలహీన వర్గాలకు పెద్దపీఠ వేసింది.

పోలింగ్ బూత్ స్థాయిలో సీఎం జగన్ వ్యూహం

సీఎం జగన్ ప్రతీ నియోజకవర్గంలో పార్టీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్దుల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ (సామాజిక సమీకరణలు) అనుగుణంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. ఓ వైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్న వైఎస్సార్ సీపీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ పైన ఫోకస్ చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఎన్నికల పరిశీలకులతో పాటుగా ప్రతీ వార్డులోనూ ప్రత్యేకంగా పార్టీ కన్వీనర్లను నియమించారు. దీంతో పాటు ప్రతీ పోలింగ్ బూత్ స్థాయిలో 15 మందితో కమిటీలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తగా ఉన్న దాదాపు 47 వేలకు పైగా పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసింది.

ప్రతీ సీటు – ప్రతీ ఓటే లక్ష్యం

ఈ కమిటీల్లో స్థానికంగా పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ కోసం పని చేస్తున్న వారికి సామాజిక వర్గాల వారీగా, మహిళలకు అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేసారు. ప్రతీ కుటుంబాన్ని బూత్ కమిటీ సంప్రదించి వారికి ప్రభుత్వంలో అందిన లబ్ధి వివరించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పథకాలు, సామాజిక న్యాయం అమలు చేస్తున్నా.. ఎన్నికల సమయంలో కీలకంగా నిలిచే పోల్ మేనేజ్మెంట్ పై సీఎం జగను దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను ఎక్కువగా రంగంలోకి దింపనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు ఉండరాదనే లక్ష్యంతో బూత్ కమిటీలను పక్కాగా నియమించారు. ఈ క్రమంలోనూ ప్రతీ ఇంటితోనూ పార్టీ కేడర్ మమేకం అయ్యేలా 15 మందితో స్థానికంగా ఎంపిక చేసి వారితో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు.

కమిటీలు – ఎన్నికల వార్ రూమ్ సిద్దం

ఎన్నికల ప్రచారంతో పాటుగా.. పోలింగ్ రోజున పార్టీ శ్రేణులు కీలకంగా వ్యవహరించాల్సిన ఉంది. ఈ క్రమంలో చురుకుగా ఉండే బూత్ కమిటీలపై వైఎస్సార్ సీపీ ప్రత్యేక శ్రద్ధ సారించింది. బూత్ కమిటీలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఎం జగన్ రోడ్ మ్యాప్ ఖరారు చేసారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రతీ పోలింగ్ బూత్ స్థాయి వరకు ఎన్నికల పరిస్థితులు, పోలింగ్ రోజున జరిగే పరిణామాలు, రాష్ట్ర, నియోజకవర్గ స్థాయి పరిస్థితులపై ఎప్పటికిప్పుడు సమాచారం సేకరిస్తూ.. అవసరమైన మార్గనిర్దేశం చేసేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లతో వార్ రూమ్ నిర్వహణకు నిర్ణయించారు. దీని ద్వారా ప్రతీ సీటు.. ప్రతీ ఓటు కీలకమనే ప్రణాళికపై సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు.

నేడు రాజ్యసభలో.. రేపు అసెంబ్లీలో టీడీపీ ఖాళీ ఖాయం

సిద్ధం క్యాడర్ సమావేశాలతో వైఎస్సార్ సీపీ దూసుకెళుతోంది. సిద్ధం సభలతో జనమంతా జగన్‌తోనే అన్న నినాదం మారుమోగుతోంది. ఓ వైపు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రకటన, మరో వైపు పోల్ మేనేజ్ మెంట్, బూత్ లెవెల్ క్యాంపెయిన్ల కోసం 47 వేల బూత్ కమిటీల నియమించి 2024 ఎన్నికలే టార్గెట్ గా వైఎస్సార్ సీపీ ముందుకెళ్తోంది.

అధికార పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పొత్తులతో ఎన్నికలకు వస్తాం అని ప్రకటించిన టీడీపీ కనీసం జనసేనతో పొత్తులపై క్లారిటీ ఇవ్వలేదు. ఎవరికి వారే రెండు పార్టీల అభ్యర్థులను ప్రకటించకుంటున్నారు. దీంతో ఏ నాయకుడు ఎక్కడ పోటీ చేస్తారో తెలీని తికమక నడుస్తోంది. దీనికి తోడు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఖాళీ అవడంతో ఆ పార్టీ పార్టీ క్యాడర్ ను మరింత కుంగదీసింది. 41 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి సారి టీడీపీ రాజ్యసభలో సభ్యత్వం కోల్పోయింది.

వైఎస్సార్ సీపీ మాత్రం ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన మూడు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అయిన టీడీపీ త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ర్ట అసెంబ్లీలో కూడా ఖాళీ అవనుందని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని.. త్వరలో లోక్‌సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు పేర్కొంటున్నారు.