WhatsApp Image 2024 03 25 at 18.37.49
Trinethram News : మంగళగిరి: రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీవారి దివ్య రథోత్సవం వైభవంగా సాగింది. యువనేత నారా లోకేష్ సోమవారం మధ్యాహ్నం శ్రీవారి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. శ్రీమాన్ మాడభూషి వేదాంతాచార్యులు నేతృత్వాన సాగిన ఈ ఉత్సవంలో నమో లక్ష్మీ నారసింహ నామస్మరణతో మంగళగిరి వీధులు హోరెత్తాయి. భక్తుల జయజయ ధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగిన స్వామివారి రథోత్సవంలో భక్తి పారవశ్యం పొంగిపొర్లింది. వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో దివ్యరథాన్ని శోభాయమానంగా అలంకరించారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శోభకృత్ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధపౌర్ణమి సందర్భంగా కన్నుల పండువగా సాగిన ఈ రథోత్సవంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేసిన మంగళగిరి పద్మశాలీయ శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథచక్రాల బృందం కమిటీ సభ్యులను యువనేత లోకేష్ అభినందించారు.
