CM Revanth Reddy : దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్, మే 08: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని దయాది దేశం పాకిస్థాన్‌‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణలో అందరం ఒక్కటేనని చాటుతూ తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తి నిచ్చేందుకే ఈ సంఘీభావ ర్యాలీ చేపట్టినట్లు ఆయన వివరించారు.

భారతదేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వారికి నూకలు చెల్లినట్లేనని.. ఇది మా హెచ్చరిక అంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుతామని ఆయన తెలిపారు. మేం శాంతి కాముకులమని ఆయన పేర్కొన్నారు. అది మా చేతగానితనం అనుకుని మా ఆడబిడ్డల నుదిటి సిందూరం తుడిచేయాలనుకుంటే.. వారికి ఆపరేషన్ సిందూర్ ద్వారా సమాధానం చెబుతామన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

అంతకుముందు గురువారం సాయంత్రం ఈ సంఘీభావ ర్యాలీ సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగింది. అనంతరం పహల్గాం మృతులకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్‌లోని పలువురు మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి.. వారి మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యగా బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అందులోభాగంగా పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మూకల స్థావరాలను నేలమట్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్య పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Will not tolerate any

You cannot copy content of this page

Scroll to Top