జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 13 at 11.18.26 AM

TRINETHRAM NEWS

హైదరాబాద్‌: తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కళల్లో వినోదమే కాకుండా విజ్ఞానం దాగి ఉందని చెప్పారు. నేటి సమాజంలో కొన్ని కళలు కనుమరుగవుతున్నాయని, వాటిని వెలికితీసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఘంటసాల పాటలతో తెలుగు సమాజం పరవశించిపోయిందని చెప్పారు. ఆయన వల్లే భగవద్గీత ప్రతి ఇంటికీ చేరిందని కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆయన రెండు నెలలు జైలుకూ వెళ్లారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఘంటసాల శత జయంతి వేడుకలను నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 
మాదాపూర్‌ సీసీఆర్టీలో భారత్ కళా మండపం, దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇటీవల ‘పద్మ’ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించారు. ఘంటసాల పేరు మీద భారత్ కళా మండపం నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. యువత పాశ్చాత్య పోకడలకు దాసోహం కాకుండా ఉండాలని సూచించారు. పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. నూతన విద్యా విధానంలో మాతృ భాషకు ప్రధాని మోదీ పెద్దపీట వేశారన్నారు. ఇంగ్లిష్ భాష నేర్చుకోవాలి తప్పితే.. ఇంగ్లిష్‌వాడిగా మారిపోకూడదన్నారు. మాతృ భాషలో విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. భారతీయ సంప్రదాయాలకు పునర్ వైభవం తీసుకువచ్చేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి చివరి వారంలో వెయ్యి స్తంభాల గుడి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తామన్నారు. సంజీవయ్య పార్కులో లైట్ షోను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

You cannot copy content of this page