ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు

TRINETHRAM NEWS

నాగోలు : ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు. అతడి ఇంటికి వచ్చి.. మాటల్లో పెట్టి బంగారు గొలుసులు లాక్కుని పారిపోయారు. నాగోలు ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఎస్సై మధు కథనం ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన పసుపులేటి శిరీష(36), ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన ఉన్నీసా బేగం అలియాస్‌ సమీనా(40) బ్యుటీషీయన్లుగా పని చేస్తున్నారు. సులువుగా సంపాదించేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో నాగోలు మత్తుగూడ సమీపంలోని తాజా హోటల్‌లో ఇటీవల ఓ వృద్ధుడిని పరిచయం చేసుకున్నారు. అతని ఫోన్‌ నంబరు తీసుకుని తరచూ మాట్లాడసాగారు. ఆదివారం తిరిగి హోటల్‌ వద్దకు వచ్చి అతడికి ఫోను చేశారు. హోటల్‌ వద్దకు రావాలని కోరారు. ఇంట్లో ఎవరూ లేరని, తానూ రాలేనని చెప్పిన వృద్ధుడు.. వారినే తన ఇంటికి ఆహ్వానించాడు. ఇదే అదనుగా ఇంట్లోకి చేరిన ఆ ఇద్దరూ.. వృద్ధుడిని మాటల్లో పెట్టారు. అనంతరం అతని మెడలోని రెండు బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బంగారు గొలుసులు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. ఉన్నీసాబేగం మరో వ్యక్తితో కలిసి హయత్‌నగర్‌ ఠాణా పరిధిలోనూ ఇదే రీతిలో ఓ వ్యక్తిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top