WhatsApp Image 2024 02 10 at 5.26.48 PM
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచిన పీవీకి ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు కూడా భారతరత్న ప్రకటించి ఉంటే తెలుగుజాతి మరింత పులకించిపోయి ఉండేదన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్టు చేశారు. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లగలిగే పరిస్థితులు ప్రస్తుతం పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ బాధ్యతను భుజాలకెత్తుకొని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలన్నీ ఈ అంశాన్ని బలపరుస్తారని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు.
