Trinethram News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా కేబినేట్లో సమీక్ష చేయాలని నిర్ణయించారు. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నారు. కాగా ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు కేబినేట్ భేటీలు జరిగాయి.
యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో రూ.1,500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, తదితర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు. సభకు 60వేల మంది హాజరవుతారన్న అంచనాలతో కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం పర్యటనలో పాల్గొననున్న మంత్రులు..
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ తదితరులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి సీఎం రేవంత్రెడ్డి బయలుదేరనున్నారు. 3 గంటలకు తుర్కపల్లి మండలం, తిర్మలాపురం చేరుకుంటారు. 3.10 గంటల నుంచి 3.25 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 3.25 గంటల నుంచి 4.40 గంటల వరకు సభలో ప్రసంగించి, పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 4.45 గంటలకు తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


