Secretariat : అమరావతిలో సెక్రటేరియట్ నిర్మాణం పై అడుగులు

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేక అంశాలను ఖరారు చేసిన ప్రభుత్వం, ఇవాళ సచివాలయ నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో శాశ్వత సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం తమ గంభీరతను చాటిచెప్పింది. ఈ మేరకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ) ప్రకటన విడుదల చేసింది.

నాలుగు సచివాలయ టవర్లు – ఒక హెచ్‌వోడీ టవర్‌

ఈ టెండర్ల ప్రకారం, మొత్తం ఐదు టవర్ల నిర్మాణానికి రూ.4,668 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. ఇందులో భాగంగా హెచ్‌వోడీ కార్యాలయం కోసం రూ.1,126 కోట్ల టెండర్ పిలవగా, సచివాలయం టవర్ 1, 2 కోసం రూ.1,897 కోట్లకు టెండర్లు జారీ చేశారు. అలాగే టవర్ 3, 4ల కోసం రూ.1,664 కోట్ల విలువైన టెండర్లు పిలవడం జరిగింది. మే 1వ తేదీన టెక్నికల్ బిడ్లను పరిశీలించి, అనంతరం ఫైనాన్షియల్ బిడ్ల ప్రక్రియను పూర్తి చేసి కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ చర్యల ద్వారా అమరావతిలో శాశ్వత సచివాలయం నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది.

మోడీ రాకకు ముందు నిర్మాణ స్పష్టత

ప్రధాని నరేంద్ర మోడీ మే 2న రాష్ట్రానికి రానున్న సందర్భంలో రాజధాని నిర్మాణాలపై ముందస్తుగా క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నిర్మాణ పనుల ప్రారంభం కాకముందే ప్రజలకు స్పష్టత ఇచ్చి, ప్రభుత్వ విధేయతను ప్రజల్లో నాటాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధానిపై గతంలో వచ్చిన విమర్శలను ఎదుర్కొని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

రెండో విడత భూసేకరణపై కూడా దృష్టి

రాజధాని నిర్మాణానికి భూముల అవసరం ఎక్కువగా ఉండటంతో, రెండో విడత భూసేకరణకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత టీడీపీ హయాంలో భూముల సమీకరణలో వచ్చిన సమస్యలు గుర్తుంచుకుని, ఈసారి మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగనున్నారు. అమరావతిలో ఎయిర్‌పోర్టు, హైకోర్టు, శాసనసభ భవనాలు, హైక్లాస్ రహదారులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం వేల ఎకరాల భూములు అవసరం అవుతాయి. అందుకే భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని సీఆర్డీఏ కార్యచరణ రూపొందిస్తోంది.

నిర్మాణాలతోనే ఎన్నికల ముఖం

రాబోయే ఎన్నికల దృష్ట్యా అమరావతి నిర్మాణం అధికార ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతిని ఒక అంతర్జాతీయ ప్రామాణిక రాజధానిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం ఉన్నది. గతంలో నిర్మాణాల్లో నిలిచిపోయిన కారణంగా వచ్చిన విమర్శల్ని సమర్థవంతంగా ఎదుర్కొనాలని, ఈసారి పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ కీలక అడుగులు వేస్తున్నారు. అమరావతిని అందమైన, ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం త్వరలోనే మిగతా నిర్మాణాలకు సంబంధించిన టెండర్లను కూడా విడుదల చేయనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Steps taken to build secretariat

You cannot copy content of this page

Scroll to Top