WhatsApp Image 2024 02 18 at 4.50.08 PM
Trinethram News : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10వ తరగతులు కొనసాగడం లేదు. మొత్తంగా ఆరో తరగతిలో 2, ఏడులో ఒకరు, ఎనిమిదో తరగతిలో ఇద్దరు విద్యార్థులున్నారు. వీరిలోనూ రోజూ ఇద్దరు లేదా ముగ్గురే హాజరవుతున్నారు. 2022-23లో ఇక్కడ 18 మంది ఉండేవారు. గతేడాది నలుగురు పదో తరగతి పూర్తి చేశారు. ఈసారి పదో తరగతికి రావాల్సిన ఒక్కరు కూడా సమీపంలోని కోరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రవేశం పొందాడు. మిగతా వారూ ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. తక్కువ మంది విద్యార్థులు ఉండటంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకుడు ఇంటి వద్దే తయారు చేసి తెస్తున్నారు. అయితే ఇద్దరు ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా.. అక్కడి ఉపాధ్యాయులు రిలీవ్ కాకపోవటంతో ఇక్కడే కొనసాగుతున్నారు. ఇదే ఆవరణలోని ప్రాథమిక పాఠశాలలో మాత్రం 30 మంది విద్యార్థులు ఉండటం విశేషం. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తామని ప్రధానోపాధ్యాయురాలు హేమలత తెలిపారు.
