జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 15 at 1.03.57 PM

TRINETHRAM NEWS

రేవంత్ సర్కారు మరో సంచలనం

CM Revanth Reddy:

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని తొలగిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు పోలీస్ శాఖకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద ఉన్న గన్‌మెన్‌లను పోలీస్ శాఖ వెనక్కి పిలిపించింది. అయితే అవసరమైన వారికి మళ్లీ సెక్యూరిటీని పునరుద్ధరించే అవకాశం ఉంది.

మరోవైపు.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్‌మెన్‌లను కేటాయించింది. ఇక ఎవరెవరికి గన్‌మెన్స్ అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగం ఒక నివేదిక సమర్పించనుంది. అనంతరం భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని వారికి సెక్యూరిటీ అవసరమా కాదా అనే విషయాన్ని తేల్చనున్నారు. భద్రత అవసరం అని భావించిన వారికి మళ్లీ గన్‌మెన్‌లను కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాలనపై పూర్తి స్థాయి దృష్టిసారించింది. గత ప్రభుత్వంలో ఏర్పడిన లోటుపాట్లను సవరించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలకు తెరలేపుతున్నారు. అధికారుల బదిలీలు, కొన్ని శాఖల్లో సమూల మార్పులు, గతంలో జరిగిన అవకతవకలపై విచారణలు, పలువురు కీలక అధికారుల బదిలీలు వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. దీంతోపాటు మూసీ అభివృద్ధి సంస్థ ఇంఛార్జ్‌ ఎండీగానూ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు.

ఇక విద్యుత్ శాఖలో మాత్రం భారీ మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి పూనుకున్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా రిజ్వీని నియమించింది. ఇప్పటికే ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న రిజ్వీకి ఈ పదవిని కట్టబెట్టారు. ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝాను ఎంపిక చేశారు. ఇక టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీ.. టీఎస్‌ఎన్పీడీసీఎల్ (వరంగల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్ రెడ్డి నియమితులయ్యారు. డిప్యూటీ సీఎం ఓఎస్డీగా ఐఏఎస్ అధికారి కృష్ణప్రసాద్, అగ్రికల్చర్ డైరెక్టర్‌గా గోపీకి కొత్త బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ నియామకం జరిగింది.

You cannot copy content of this page