అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 26: అనారోగ్యంతో శ్రమిస్తున్న గ్రామస్తుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం: మండల కమిటీ సభ్యుడు రామన్న. అరకువేలి మండలం మాదల పంచాయతీ పరిధిలోని చివరి సరిహద్దు గ్రామమైన కమలతోటలో తీవ్ర ఆరోగ్య సమస్యలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గత నెల రోజులుగా గ్రామంలో చిన్నారులు, వృద్ధులు సహా అనేక మంది విష జ్వరాల బారిన పడగా, ఇప్పటివరకు ప్రభుత్వ వైద్య శాఖ ఎటువంటి స్పందన చూపకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్థులు తెలియజేసిన వివరాల ప్రకారం – గ్రామంలో దాదాపు 30 మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిలో వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు ఉన్నారు. ముఖ్యంగా 75 ఏళ్ల చిట్టన్న, 80 ఏళ్ల లచ్చమ్మ, ఐదు సంవత్సరాల బాలనన్న, రెండు సంవత్సరాల అఖిల, ఒక్క సంవత్సరం వయస్సున్న నందినిలాంటి చిన్నారుల ఆరోగ్యం విషమించడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఈ పరిస్థితిని పరిశీలించిన సిపిఎం మండల కమిటీ సభ్యుడు పి. రామన్న స్థానికులను పరామర్శించి, వారి సమస్యలను వినిపించారు. ప్రభుత్వం వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, మంచినీటి సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామస్థులు మురికి నీరు తాగడం వల్లే విష జ్వరాలు విస్తరిస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
“ఒరిస్సా-ఆంధ్ర సరిహద్దులో ఉండే మా గ్రామాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. చిన్నారులు విపత్కర స్థితిలో ఉన్నా అధికారులెవ్వరూ వచ్చి చూడలేదు. ఇది మానవత్వానికి తిగిన మచ్చ” అని గ్రామస్తులు వాపోతున్నారు.
సిపిఎం పార్టీ తరఫున రామన్న హెచ్చరిస్తూ, “తక్షణమే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయకపోతే, పోరాటాలు ముమ్మరం చేస్తాం. ప్రజల ఆరోగ్యం హక్కు. దాన్ని నిర్లక్ష్యం చేయడం సహించదగినది కాదు” అని స్పష్టం చేశారు.
సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, పౌరులు మంచి నీటిని పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ప్రజా ఆందోళనలు ఎదురవుతాయని సిపిఎం నేతలు హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


