
రూ.కోటి 25 లక్షల పేపరు మిల్లు సీఎస్ఆర్ నిధులతో పనులకు శ్రీకారం
రాజమహేంద్రవరం: స్థానిక 41వ వార్డు పరిధిలోని కోటిలింగాల పేటలో దశాబ్దాల నాటి ముంపు సమస్యకు పేపరుమిల్లు సహకారంతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. పేపరుమిల్లు సీఎస్ఆర్ ఫండ్స్ రూ. కోటి 25 లక్షలతో నిర్మిస్తున్న పంపు హౌస్, పైపు లైన్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 41వ డివిజన్ ఇంచార్జ్ నందివాడ దినేష్ పర్యవేక్షణలో నగర బీసీ సెల్ అధ్యక్షులు బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దశాబ్ద కాలానికి పైగా ఉన్న ముంపు సమస్య నుండి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ పనులు మే 30వ తేదీ నాటికి పూర్తి అవుతాయని చెప్పారు.
ఎన్నో ఏళ్ళుగా కోటిలింగాల పేట ప్రజలు వర్షాకాలంలో ముంపు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో వర్షం ముంపు సమయంలో ఈ ప్రాంతంలో నీరు నిలిచిపోతే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పత్తాలేకుండా పపోయేవారని ఆ సమయంలో తాను మోకాలిలోతు నీటిలో ఇంటింటికీ తిరిగి స్థానిక ప్రజలకు పాల ప్యాకెట్లు, తాగునీరు అందించానని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ముంపు నివారణకు పేపరు మిల్లు సహకారంతో రూ. కోటి 25 లక్షల సీఎస్ఆర్ ఫండ్స్ తో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. వర్షం కురిసిన వెంటనే ఆ నీటిని పైపు లైన్ ద్వారా మళ్ళిస్తారని దాంతో ఇక్కడ ముంపు సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు మేలు చేసే పనులు చేయకుండా వారి జేబులు నింపుకునేందుకు పేపరుమిల్లు నుంచి డబ్బు సంచులు పట్టుకుపోయారని ఆరోపించారు.
గతంలో వైసీపీ పాలనలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఏ పనిచేసినా కమీషన్లు దండుకోవడం, ప్రచారం పిచ్చితో ఫ్లెక్సీలు వేసుకునేవారని విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలని తపన తప్ప తమకు అలాంటి యావ లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. మరో రూ.8 లక్షలతో 45వ వార్డు పరిధిలోని ఆనందనగర్ మున్సిపల్ స్కూలులో డిజిటల్ లైబ్రరీ కల్పిస్తున్నామని, మొత్తం రూ. కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, పేపర్ మిల్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్, టీడీపీ నాయకులు కొయ్యల రమణ, ఆడారి లక్ష్మీ నారాయణ, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
