WhatsApp Image 2024 02 16 at 15.10.23
Trinethram News : మహబూబ్నగర్:- మహబూబ్నగర్ జిల్లాలో వీధి కుక్కలను తుపాకులతో కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట్ మండలం పొన్నకల్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలో 20 వీధి కుక్కలను కాల్చి చంపారు. ఈ కుక్కలను తుపాకీతో కాల్చి చంపినట్లు తెలుస్తున్నది. తుపాకుల మోత వినిపించకుండా సైలెన్సర్ బిగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామంలో ఉన్న కుక్కలన్నింటినీ చంపడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అసలు కాల్చింది ఎవరు? ఎందుకు తుపాకులతో కుక్కలను కాల్చారు అనేది మిస్టరీగా మారింది. కుక్కల కోసం తుపాకులు వినియోగించడం ఏంటని పోలీసులు సైతం విస్తుపోతున్నారు. తెల్లవారుజామున గ్రామంలో వీధి కుక్కలు రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన గ్రామస్తులు షాక్కు గురయ్యారు.వెంటనే అప్రమత్తమై ఎలా చనిపోయాయని ఆరా తీస్తే పక్కనే బుల్లెట్లు తగిలి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయం దావనంలో పాకడంతో గ్రామం మొత్తం నిర్ఘాంత పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అం దించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కుక్కలను చంపింది ఎవరు? ఎందుకు చంపారనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
