ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 29 at 22.26.55

TRINETHRAM NEWS

Trinethram News : సీఎం జగన్ ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేశారు. మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ బస్సుయాత్ర సాగనుంది. అయితే గతంలో సిద్దం పేరుతో నిర్వహించిన ప్రాంతాల్లో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో దీనిని చేపట్టనున్నారు. తొలిరోజు ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర రెండవ రోజు నంద్యాల చేరుకుంది. మూడవ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ముందు ర్యాంప్ పై ప్రజలకు అభివాదం చేస్తే ముందుకు సాగారు. ఆ తరువాత తన పాలనాతీరు గురించి ప్రజలకు వివరించారు. 58 నెలల కాలంలో చేసిన అభివృద్దిని, సంక్షేమాన్ని గురించి వివరంగా ప్రజలకు చెప్పారు. ఆ తరువాత మే 13న జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో పెత్తందారులను ఓడించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన చంద్రబాబు తోక కత్తిరించేలా ఓటు వేయాలన్నారు.

ఐదేళ్లుగా మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టాలని పిలుపునిచ్చారు జగన్. విద్యార్థుల గురించి ఏమాత్రం ఆలోచన చేయని చంద్రబాబుకు ఓటేస్తారా.. లేక విప్లవాత్మక మార్పులు తెచ్చిన తనకు ఓటేస్తారా అంటూ ప్రశ్నించారు జగన్. పిల్లల భవిష్యత్తును మార్చే శక్తి ఓటుకు ఉంది. ఆలోచించి ఓటేయాలన్నారు. వ్యవసాయం దండగన్న పార్టీకి మద్దతు పలుకుతారా.. లేక రైతు బిడ్డకు ఓటేస్తారా మీరే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు నా అని చెప్పుకోవడానికి ఏ వర్గం లేదన్నారు. ఆయన వర్గాలన్నీ పక్క రాష్ట్రంలో ఉన్నాయన్నారు. గత టీడీపీ పాలనలో ఒంటికి ఒక ఉద్యోగం అన్నారు.. లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నరు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రజలను అడిగారు. చంద్రబాబుకు చాలా మంది స్టార్ క్యాంపైనర్లు ఉన్నారని.. కానీ నాకు మాత్రం మీరే స్టార్ క్యాంపైనర్లని పేర్కొన్నారు. గత పాలనను చూసిన అక్కచెల్లెమ్మలు తనకు రాఖీ కట్టినట్లే, వైసీపీ ప్రభుత్వానికి కూడా రాఖీ కట్టండి అని కోరారు.

మహిళలకు తమ ప్రభుత్వంలో పెద్ద పీట వేశామన్నారు. అన్ని స్థానిక సంస్థల పదవుల్లో 50శాతం మహిళలకే సీట్లు కేటాయించామన్నారు. చట్టసభల్లోనూ మహిళలకే అగ్రభాగం కేటాయించామన్నారు. క్యాబినెట్ పదవుల్లో కూడా అధికశాతం మంది మహిళలు ఉన్నారన్నారు. అలాగే పేదవాడి ఇంట్లో చదువుకు డబ్బులు అడ్డంకిగా మారకూడదని అమ్మ ఒడి ఇచ్చామన్నారు. తన అక్కచెల్లెమ్మలకోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. ఇందులో ఎలాంటి అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా పాలన సాగించామన్నారు. అవ్వతాతలకు ప్రతి నెలా ఒకటో తారీఖునే రూ.3వేల పెన్షన్‌ ఇస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో రూ.3వేల పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం మన ఏపీ నే అని తెలిపారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. పేదోడికి వైద్యం అందక ప్రాణాలు పోకూడదని ఫ్యామిలీ డాక్టర్ సిస్టంను తీసుకొచ్చినట్లు తెలిపారు. మరొక్క సారి మీ బిడ్డకు అవకాశం ఇస్తే మరింత మంచి చేస్తాన్నన్నారు. అర్హత కలిగి సంక్షేమ పథకం అందిఉంటే తనకు ఓటు వేయమని కోరారు సీఎం జగన్. తమ లక్ష్యం 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 పార్లమెంట్ స్థానాలు గెలవడమే అన్నారు. తమ ఎన్నికల గుర్తు ఫ్యాన్ అంటూ వేదికపై నుంచి ప్రజలకు చూపించారు సీఎం జగన్.

You cannot copy content of this page