మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే..
Trinethram News : హైదరాబాద్ : భారతదేశ వ్యాప్తంగా ఇవాళ(బుధవారం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మాక్డ్రిల్ను నిర్వహిస్తున్నాయి. పహల్గామ్ల్ అమాయకులైన భారత పర్యాటకులు 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి చంపేశారు. ఈ ఘటనను ప్రపంచ వ్యాప్తంగా ఖండించారు. ఈ క్రమంలో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యలో యుద్ధం వస్తే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాక్ డ్రిల్ జరపనున్నాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించే మాక్ డ్రిల్పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు(మే7) సాయంత్రం 4:00 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, కంచన్ బాగ్, నానాల్నగర్లలో మాక్ డ్రిల్ జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న కంటోన్మెంట్ ఏరియాల ద్వారా ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…ధైర్యంగా ఉండాలని అన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, పరిస్థితులు కనిపిస్తే దగ్గరలోని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
భారతదేశ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో సాయుధ దళాలను చూసి గర్విస్తున్నానని.. జై హింద్ అని అభినందనలు తెలిపారు. భారతదేశం ఎవరికి తలవంచాల్సిన విధంగా ఉండకూడదని అన్నారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభా కర్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల అంతర్గత భద్రతకు సంబంధించి కఠినంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎక్కడైనా, ఏదైనా ప్రజలకు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీస్ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


