Lal Darwaja Simhavahini Mahankali Bonalu
Trinethram News : ఆషాఢం నెలరోజులూ హైదరాబాద్ లో బోనాలు నిర్వహిస్తారు. చివరి ఆదివారం నాడు లాల్ దర్వాజా సింహవాహినికి బోనాలు సమర్పించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని అప్పట్లో బిజిలీ మహంకాళి అని పిలిచేవారు. హైదరాబాద్ రాజ్యానికి అప్పటి ప్రధానమంత్రి మహ రాజా కిషన్ ప్రసాద్ తొలిసారిగా బోనాలు సమర్పించారు. 1968లో కొందరు భక్తులు కలిసి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. కంచి కామకోటి పీఠాధిపతుల చేతుల మీదుగా సింహవాహినియైన మహాకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
సింహవాహనంపై అమ్మ ఉన్నందున కాలక్రమేణ బిజిలీ మహాకాళి అనే పేరు సింహవాహిని మహాకాళిగా ప్రసిద్ధి కెక్కింది. హైదరాబాదులోని గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయాలలో జరిగే బోనాల అనంతరం ఆషాఢంలోని చివరి ఆదివారం నాడు సింహవాహిని బోనాలు చేయడం పరిపాటి. అమ్మవారికి బెల్లంతో చేసిన అన్నం, రోగ నివారిణియైన వేపాకు సమర్పిస్తారు. మూడో శుక్రవారం ఉదయం అభిషేకం, సాయంత్రం విశేష పూజలతో బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది.
ఆదివారం ఉత్సవ ఘటాన్ని దగ్గరలో ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయం నుండి మేళతాళాలతో తీసుకొచ్చి మహాకాళి ఆలయంలో ఉంచుతారు. ఉత్సవ విగ్రహానికి కూడా పూజలు చేస్తారు. ఆ తర్వాత బోనాలు సమర్పిస్తారు. సోమవారంనాడు అమ్మవారి ఘటాన్ని, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి చివరగా మూసీ నదిలో ఘటాన్ని నిమజ్జనం చేస్తారు. తరువాతి ఆదివారం నాడు అభిషేకం, శాంతి కల్యాణం నిర్వహించడంతో ఆషాఢ ఉత్సవాలు ముగుస్తాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


