WhatsApp Image 2024 02 06 at 10.59.35 AM
Trinethram News : ములుగు : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది..
మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మావోయిస్టు (జేఎమ్డబ్ల్యూపీ) కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడారం జాతరకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలు లేవని.. మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరను పూర్తిగా ఆదివాసి సంప్రదాయాలతోనే చేయాలని లేఖలో తెలిపారు..
హిందూ సంప్రదాయాలైన లడ్డు, పులిహోర లాంటివి కాకుండా బెల్లం ప్రసాదంగా ఇవ్వాలన్నారు. జాతర అయిన వెంటనే ఆ ప్రాంతంలో ప్రభుత్వం బాధ్యత వహించి నిధులు కేటాయించి జబ్బులు రాకుండా శుభ్రం చేయాలన్నారు. జబ్బు పడిన వారికి తగిన చికిత్సను అందించాలని డిమాండ్ చేశారు. జాతర పనుల కోసం విడిచిపెట్టిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పంట పొలాల్లో బ్రాందీ సీసాలతో పాటు రకరకాల వ్యర్థ పదార్థాలు అన్నింటినీ తీసివేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని చేయాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు..
