జనవరి 26 నుంచి 4 కొత్త ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

TRINETHRAM NEWS

జనవరి 26 నుంచి 4 కొత్త ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*రామగుండం నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

రామగుండం, జనవరి 15: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జనవరి 26 నుంచి 4 కొత్త ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

బుధవారం ఎన్టిపిసి లోని మిలీనియం ఆడిటోరియంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల జారీ, తదితర అంశాలపై నిర్వహించిన రామగుండం నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష ,అదనపు కలెక్టర్ డి.వేణు (రెవెన్యూ), అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్వహించిన సర్వేలో భూములు ఉన్న అత్యంత పేదలకు మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. మన పరిశీలనకు వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను మరొకసారి చెక్ చేసుకోని, గ్రామాల/ వార్డుల వారీగా అర్హులను ఎంపిక చేసుకొవాలని, ఎటువంటి ఒత్తిడులకు గురికాకుండా అత్యంత పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు.

సామాజిక ఆర్థిక సర్వే కింద మన పెద్దపల్లి జిల్లాలో తేలిన ఆహార భద్రత కార్డులు లేని కుటుంబాలకు మండలాలలో ఎంపీడీవోలు, పట్టణాలలో మున్సిపల్ కమిషనర్ నూతన రేషన్ కార్డుల జారీ పర్యవేక్షించాలని అన్నారు.

రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి మండలంలోని తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్లు, మైనింగ్ అధికారులు సంయుక్తంగా పని చేసి పట్టా దార్ పాస్ పుస్తకాల డేటా, గూగల్ మ్యాప్ , రెవెన్యూ మ్యాప్ వారీగా పరిశీలిస్తూ భూ భారతి (ధరణి) నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్దిదారులను తొలగించాలని అన్నారు.

రాళ్లు రప్పలు ఉన్న భూములు, సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ చేసిన భూములు, పరిశ్రమల భూములు (రైస్ మిల్ పెట్రోల్ బంక్, ఆహార శుద్ధి పరిశ్రమ….), నాలా కన్వర్షన్ జరిగిన భూములు, లేఔట్ ఉన్న భూములు, ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తు భూములు, రొడ్ల భూములు, భవనాలు నిర్మించుకున్న భూముల, మైనింగ్ జరుగుతున్న భూముల వివరాలు రైతు భరోసా నుంచి తొలగించాలని అన్నారు.

భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలకు రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందని, 2023-24 సంవత్సరానికి 20 రోజులు పని చేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. ఈ పథకం కుటుంబం యూనిట్ గా అందించడం జరుగుతుందని, వ్యక్తిగతంగా అందించే పథకం కాదని అన్నారు.

గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న 4 కార్యక్రమాల మార్గదర్శకాలు, ఉద్దేశం ప్రజలకు వివరిస్తూ పథకాల అర్హుల జాబితాను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత తుది జాబితా తయారు చేయాలని అన్నారు.

జనవరి 23 లోపు గ్రామ సభల నిర్వహణ పూర్తి చేయాలని, గ్రామ సభ ఆమోదించిన తరువాత తుది జాబితా ఆన్ లైన్ లో జనవరి 25 సాయంత్రం లోపు నమోదు చేయాలని, జనవరి 26 నుంచి 4 పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జడ్పీ సీఈవో నరేందర్, ఆర్డిఓ గంగయ్య, తహసిల్దార్ కుమారస్వామి, పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top