కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్‌ కు ఎంపిక చేసినందుకు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్‌ కు ఎంపిక చేసినందుకు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో వీడియో విడుదల చేశారు. ‘‘పద్మవిభూషణ్‌ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. మనదేశంలో రెండో అత్యన్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లికడుపున పుట్టకపోయినా, నన్ను తమ సొంతమనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా నాతో ప్రతినిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. నాకు దక్కినటువంటి ఈ గౌరవం మీది.
మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిద్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నిజజీవితంలో కూడా నా చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాను. కానీ నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతిక్షణం గుర్తుకువస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top