ఆర్పిలు వేతనాల కోసం పోరాడితే అరెస్టులా?

TRINETHRAM NEWS

ఆర్పిలు వేతనాల కోసం పోరాడితే అరెస్టులా?

మెప్మా ఆర్పిలను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం.

ఆర్పీలు లేకుంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరవు

తక్షణమే ఆర్పీల వేతనాలు వారి ఖాతలో జమచేసి అరెస్టు చేసిన మహిళలను విడుదల చేయాలి.

మద్దెల దినేష్ డిమాండ్

త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

మెప్మా ఆర్పీలకు గత ఆరు నెలల నుండి వేతనాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా మెప్మా కార్యాలయం ముట్టడికి బయలుదేరిన పెద్దపల్లి జిల్లా ఆర్పీలను కరీంనగర్ దగ్గర పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్పిఎస్) జిల్లా కన్వీనర్ మద్దెల దినేష్, ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం.ఏ. గౌస్ అర్పీ మహిళల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని, పోలీసులు మహిళలని చూడకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని వారు అగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల పథకాలు ప్రవేశపెడితే అట్టి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు ఆర్పీలు కష్టపడుతూ అనేక కష్టనష్టాలు, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ప్రతి పథకం ప్రజలకు చెందేలా, ప్రజలకు తెలిసేలా అహర్నిశలు కృషి చేసేది ఆర్పీలు మాత్రమేనని వారన్నారు.
ఆర్పిలకు గత ఆరు నెలల నుండి వేతనాలు రాక అన్ని రకాలుగా కుటుంబ పోషణ భారంగా మారుతున్న తరుణంలో మా వేతనాలు మాకు ఇవ్వండి అని రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మెప్మా కార్యాలయం ముట్టడిలో భాగంగా పెద్దపల్లి జిల్లా నుండి మెప్మా విభాగం ఆర్పిలు పెద్ద ఎత్తున హైద్రాబాద్ కు వెళుతున్న సందర్భంగా కరీంనగర్ దగ్గర టోల్గేట్ ప్రాంతంలో అక్రమంగా పోలీసులు అడ్డుకొని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రైవేట్ కమ్యూనిటీ హాల్లో ఉంచి కనీసం మంచినీటి సౌకర్యం, భోజనాలు కూడా ఏర్పాటు చేయకుండా అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గపు చర్య అని వారు ఆరోపించారు.
అహర్నిశలు ఆర్పీలు కష్టపడుతూ పనిచేస్తున్నవారు కొంతమందికి అనారోగ్యాలు మరియు షుగర్లు, బీపీలు ఉన్నప్పటికీ కనీసం వారి వయసు రీత్య కూడా చూడకుండా అక్రమ అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని తక్షణమే ఆర్పీల ఖాతాలలో తమ పెండింగ్ వేతనాలు వేయాలని అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్పీలు చేస్తున్న కష్టాన్ని చూసి ప్రభుత్వం స్పందించి వారికి వేతనాలు పెంచాల్సింది పోయి చేస్తున్న పనికి వేతనాలు ఇవ్వాలని ప్రశ్నించి పోరాడుతుంటే అక్రమంగా అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని వారు హెచ్చరించారు ఆర్పీలు లేకుంటే ప్రభుత్వ పథకాలే లేవని ప్రజల్లోకి చేరయని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అర్పిలకు నిరంతరం డిహెచ్పిఎస్, ఎఐటియూసి అండగా ఉంటుందని వారన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top