రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ: చంద్రబాబు

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి: సమర్థ ఛైర్మన్‌ లేకపోతే ఏపీపీఎస్సీ బోర్డు అంతా సర్వనాశనమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు..

”ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. ప్రజలకు సేవలందించాలని కొంత మంది గ్రూప్‌ పరీక్షలకు వస్తారు. మా హయాంలో నిజాయతీ గల వ్యక్తులను ఛైర్మన్‌గా నియమించాం. ఇప్పుడు రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ మారిపోయింది. రాష్ట్ర యువతను దుర్మార్గంగా దగా చేసి వారి ఆశలు చంపేశారు. ఛైర్మన్‌గా నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్‌భాస్కర్‌ను మెడపట్టి బయటకు పంపారు. జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్‌ సవాంగ్‌ను నియమించారు.

2018లో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవినీతి రాజ్యమేలింది. గౌతమ్‌ సవాంగ్‌ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ అయ్యాక దురాలోచనకు తెరలేపారు. వాల్యుయేషన్‌ను దాచిపెట్టి మళ్లీ రెండోసారి చేశారు. రెండో మూల్యాంకనం జరగలేదని కోర్టుకు చెప్పారు. జరిగిందనడానికి ఆధారాలు ఇస్తున్నాం. మాన్యువల్‌ వాల్యుయేషన్‌కు వచ్చిన వారి కోసం రూ.20 లక్షలు ఖర్చు పెట్టారు. ఆవాస రిసార్ట్‌కు ఈ మొత్తం చెల్లించినట్లు బిల్లులు ఉన్నాయి. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతకు కర్నూలు నుంచి కానిస్టేబుళ్లను తీసుకొచ్చారు. క్షమించరాని నేరం చేసిన దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పులేదు. నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాలకంటే ఘోరంగా వ్యవహరించారు.

నిరుద్యోగులకు వెలుగులు పంచాల్సిన ఏపీపీఎస్సీ చీకట్లు నింపింది. ఫిబ్రవరి 2022లో గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేస్తామనలేదా? ఈమేరకు సొంత పత్రిక సాక్షిలో కూడా కథనాలు రాసింది నిజం కాదా? ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల్లో భాగస్వామి. మూల్యాంకనం ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారు. తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల కోసం అక్రమాలకు పాల్పడ్డారు. అందుకు తగ్గట్టుగా ఛైర్మన్‌ స్థాయిలో గౌతమ్‌ సవాంగ్‌ సహకరించారు. ఇన్ని అక్రమాలకు తావిచ్చిన ఆయన ఐపీఎస్‌కు అనర్హుడు.” అని చంద్రబాబు విమర్శించారు.

You cannot copy content of this page

Scroll to Top