జూలై 5, 2026
TRINETHRAM NEWS
Action against gas agencies

Action against Gas Agencies : అరకు లోయ, మే 21 (త్రినేత్రం న్యూస్) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలంలో గ్యాస్ సిలిండర్లపై అదనపు ధరలు వసూలు చేస్తున్న నిత్య భారత్ గ్యాస్ ఏజెన్సీపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు.
బుధవారం అరకు వ్యాలీ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులతో కలిసి ఫిర్యాదు సమర్పించిన ఆయన మాట్లాడుతూ, ఆన్లైన్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.937.50గా ఉండగా, ఏజెన్సీ మాత్రం ఒక్కో సిలిండర్‌ను రూ.1020కి విక్రయిస్తూ అదనంగా సుమారు రూ.80 వరకు అక్రమంగా వసూలు చేస్తోందని ఆరోపించారు. గిరిజన ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లు అమ్మడం అన్యాయమన్నారు.
అలాగే, మాడుగుల శ్రీలక్ష్మి భారత్ గ్యాస్ ఏజెన్సీపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆన్లైన్‌లో ముందుగానే బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందించకుండా, వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు. బుకింగ్ చేసిన లబ్ధిదారులను పట్టించుకోకుండా అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని, ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే గ్యాస్ సిలిండర్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు గ్యాస్ లబ్ధిదారులు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page