ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Extensive Awareness Program

250 మందికి డ్రగ్ టెస్టులు.. నలుగురికి కౌన్సిలింగ్

డ్రగ్స్ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవు: పోలీసులు

Extensive Awareness Program : త్రినేత్రం న్యూస్ : పాకాల, జూలై 04 : తిరుపతి జిల్లా వ్యాప్తంగా గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా పాకాల మండలం దామలచెరువు గ్రామంలోని మాంగో నగర్ ప్రాంతంలో శనివారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మామిడి తోటల కార్మికులు, లారీ డ్రైవర్లు, హమాలీలు, ఇతర శ్రామికులకు గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబ జీవితం, ఉపాధి, సమాజంపై కలిగే తీవ్ర దుష్పరిణామాలపై పోలీసులు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
అనంతరం 250 మందికి ప్రత్యేక డ్రగ్ టెస్టులు నిర్వహించగా, నలుగురికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు గుర్తించారు. వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి, తొలిసారి కావడంతో హెచ్చరిక జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతున్నాయని, మాదకద్రవ్యాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు తెలియజేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో డ్రగ్-ఫ్రీ తిరుపతి జిల్లాను సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page