కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు

TRINETHRAM NEWS

హైదరాబాద్‌: కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘రాహుల్‌గాంధీ పాదయాత్రతోనే  కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు.. హామీలు అమలు ఎక్కడ అని భారాస నేతలు అడుగుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు హామీలు అమలు చేస్తాం. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా నగదు అందిస్తాం. భారాస అమలు చేశారా? పదేళ్లలో కేసీఆర్‌ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలి. కొందరు నన్ను మేస్త్రి అని విమర్శిస్తున్నారు. అవును.. తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనే.
అవినీతిపరులు, కోటీశ్వరులను కేసీఆర్‌ రాజ్యసభకు పంపించారు. బలహీన వర్గాల బిడ్డలు మందుల శామ్యూల్‌, వెడ్మ బొజ్జుకి కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇచ్చి గెలిపించింది. రైతు బిడ్డనైన నేను కాంగ్రెస్‌లో సీఎం అయ్యాను. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలు ఉంటాయి. లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకం. భారాసను మొన్న ఎన్నికల్లో ఓడించాం.. పార్లమెంట్‌ ఎన్నికల్లో తరిమికొడదాం. పులి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పులి వస్తే బోనులో పెట్టి బొందపెడతాం. మోదీ, కేసీఆర్‌ వేరువేరు కాదు. అభ్యర్థులను మారిస్తే గెలిచే వాళ్లమని భారాస నేతలు అంటున్నారు. మార్చాల్సింది అభ్యర్థులను కాదు.. కేసీఆర్‌ కుటుంబాన్ని’’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

You cannot copy content of this page

Scroll to Top