వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మోమిన్పేట్ మరియు నవాబ్పేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ల ఆవరణలను, స్టేషన్లోని రికార్డులను, రిసెప్షన్, వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం మోమిన్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోమిన్పేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని, ఎంపిడిఓ కార్యాలయంలోని డిఆర్సి కేంద్రాన్ని సందర్శించి అక్కడి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. తదనంతరం నవాబ్పేట్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి, ఆ పరిధిలోని ఏక్మామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని కూడా సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులను, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా తమకు కేటాయించిన పోలింగ్ లొకేషన్ల యొక్క భౌగోళిక పరిస్థితులు, గత ఎన్నికల చరిత్ర, మరియు అక్కడ ఉన్న సున్నితమైన అంశాల గురించి ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖతోపాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ, టీమ్ వర్క్ తో పని చేయాలని, ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


