అల్లూరిజిల్లా అరకులోయ, నవంబర్ 13 (త్రినేత్రం న్యూస్): ప్రతి ఏడాది నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటారు. స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ప్రకటించడం వెనుక ఉద్దేశ్యం పిల్లల పట్ల ప్రేమ, ఆప్యాయం మరియు వారి హక్కుల పరిరక్షణ. ఈ రోజు పిల్లల సృజనాత్మకత, చైతన్యం, సామాజిక అవగాహనను ప్రోత్సహించే అనేక సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా ఉంది.
అయితే, ఈ ప్రత్యేక దినాన పాఠశాలల్లో ఎస్.ఏ–1 పరీక్షలు నిర్వహించడం అత్యంత విచారకరమని గిరి బాల నేస్తం జిల్లా కన్వీనర్ వి.వి.జయ పేర్కొన్నారు. బాలల దినోత్సవం రోజున పరీక్షలు పెట్టడం, బాలల హక్కులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా వారి మీద అనవసర మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లలకు ఆట, ఆనందం, అభివ్యక్తి, సృజనాత్మకతకు అవకాశం ఇవ్వాల్సిన రోజుగా ఉండాలి. కానీ పరీక్షల బరువుతో వారిని ఒత్తిడికి గురిచేయడం సరైంది కాదని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పునరాలోచించి, నవంబర్ 14న నిర్వహించే పరీక్షలను రద్దు చేసి, పాఠశాలల్లో సామూహిక కార్యక్రమాలు, పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా తగిన సూచనలు జారీ చేయాలని వి.వి.జయ విజ్ఞప్తి చేశారు.
బాలల భవిష్యత్తు, వారి మానసిక ఆరోగ్యం పట్ల ప్రభుత్వం, విద్యా శాఖ మరింత సున్నితంగా వ్యవహరించాలని ఆమె అభిలాష వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


