Cyclone Montha : మొంథా తుఫాన్ ప్రభావంతో పర్యాటకులు రాక మందగింపు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఇబ్బందుల్లో

TRINETHRAM NEWS

అరకు వ్యాలీ, నవంబర్ 8 (త్రినేత్రం న్యూస్): ఇటీవల కొండ ప్రాంతాలను వణికించిన మొంథా తుఫాన్ ప్రభావం ఇంకా అరకు వ్యాలీ పర్యాటక రంగంపై కొనసాగుతోంది. తుఫాన్ తగ్గిపోయినా, పర్యాటకుల రాక గణనీయంగా తగ్గిపోవడంతో స్థానిక ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఆదాయం లేక కుటుంబాలను పోషించుకోవడం కష్టమైపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరకు వ్యాలీ సహజ సౌందర్యంతో నిండిన పర్యాటక క్షేత్రం పచ్చని కొండలు, పొగమంచు కమ్ముకున్న లోయలు, వలసి పూలు, జలపాతాలు ఇవన్నీ కొత్త అందాన్ని చూపిస్తున్నప్పటికీ, పర్యాటకుల తాకిడి ఇంకా సాధారణ స్థాయికి చేరలేదు.
స్థానిక ఆటో డ్రైవర్ గెమ్మెలి మూర్తి మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం ఈ కాలంలో అరకులో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేది. కానీ తుఫాన్ తగ్గిపోయి వాతావరణం చక్కబడినా ఇంకా పర్యాటకులు రాకపోవడంతో జీవనోపాధి దెబ్బతిన్నది,” అని అన్నారు.ట్యాక్సీ డ్రైవర్ కిల్లో దాసు మాట్లాడుతూ “ఇప్పుడు అరకులో వాటర్‌ఫాల్స్, కొండలపై మంచు చూసేందుకు నిజంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. వలసి పూలు, వ్యూ పాయింట్లు అద్భుతంగా మెరిస్తున్నాయి. ఈ సీజన్‌ అరకును సందర్శించడానికి అత్యుత్తమ సమయం. పర్యాటకులు తప్పక రావాలి,” అని ఆకర్షణీయంగా వివరించారు.ప్రస్తుతం బొర్రా గుహలు, చాపరాయి, మాడగడ వ్యూ పాయింట్‌ల పరిసరాల్లో మబ్బులు, పొగమంచు కలిసిపోయి మాయాజాలాన్ని సృష్టిస్తున్నాయి.
స్థానికులు, ఆటో మరియు ట్యాక్సీ డ్రైవర్లు ప్రభుత్వం మరియు పర్యాటకశాఖ కలసి ప్రచారం చేపట్టి పర్యాటకులను తిరిగి ఆకర్షించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అరకువ్యాలీ మళ్లీ తన సహజ సౌందర్యంతో పిలుస్తోంది.ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఇదే సరైన సమయం అని దాసు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tourist arrivals slow due to Cyclone Montha

You cannot copy content of this page

Scroll to Top