సింధ్ ప్రావిన్స్లో రైల్వే ట్రాక్పై పేలుడు, ఏడుగురికి గాయాలు
క్వెట్టా వెళ్తుండగా షికార్పూర్ జిల్లాలో ఘటన
బాధితులను ఆసుపత్రులకు తరలించిన అధికారులు
గతంలోనూ ఇదే రైలుపై పలుమార్లు దాడులు జరిగిన వైనం
Trinethram News : పాకిస్థాన్లో ప్రయాణికుల రైలుపై మరోసారి దాడి జరిగింది. క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన పేలుడులో కనీసం ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్లోని షికార్పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రైలుపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, షికార్పూర్ జిల్లాలోని సుల్తాన్ కోట్ రైల్వే స్టేషన్కు కిలోమీటరు దూరంలో ఉదయం 8:15 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై దుండగులు అమర్చిన బాంబు పేలింది. జాఫర్ ఎక్స్ప్రెస్ ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఈ పేలుడు సంభవించినట్లు షికార్పూర్ డిప్యూటీ కమిషనర్ షకీల్ అబ్రో ధ్రువీకరించారు.
ఈ ఘటనలో గాయపడిన ఏడుగురిలో నలుగురిని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రికి, మిగిలిన ముగ్గురిని షికార్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. పేలుడు తర్వాత ప్రయాణికులను సమీప స్టేషన్లకు తరలించి, రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు ప్రారంభించినట్లు సుక్కూర్ డివిజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి మోహసిన్ అలీ సియాల్ వివరించారు.
జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు తరచూ దాడులకు గురవుతోంది. గత నెల సెప్టెంబర్ 24న బలూచిస్థాన్లోని మస్తుంగ్ ప్రాంతంలో ఇదే రైలుపై జరిగిన బాంబు దాడిలో 12 మంది గాయపడ్డారు. ఆ ఘటనలో రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఉగ్రవాదులు ఇదే రైలును హైజాక్ చేసి, 400 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. తాజా ఘటనతో ప్రయాణికుల్లో మరోసారి ఆందోళన నెలకొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


