రాజమహేంద్రవరం : రబీ సీజన్లో గతంలో కంటే అధికంగా ధ్యానం కొనుగోలు చేశామని, అయితే రికార్డుల నిర్వహణ విషయంలో అధికారులు, సిబ్బంది పనితీరు లోపభూయిష్టంగా ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు..
మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రబీ సీజన్లో ధాన్యం సేకరణ పై సమన్వయ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ… రబీ సీజన్లో ధాన్యం సేకరణ ప్రక్రియకు రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక, ఆచరణలో పెట్టడం లో అధికారుల పాత్ర, వారి పర్యవేక్షణ పై కలెక్టర్ ప్రశ్నించారు. మండలాలు, రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏ ఏ రకాల ధాన్యం సాగు చేశారు? వాటిలో ఏ రకం పీడీఎస్ కోసం సేకరించాలి అన్న విషయం పై అవగాహన కలిగి ఉండాలన్నారు. కోతలు పూర్తి చేసిన తర్వాత ఎన్ని రోజులకు మిల్లింగ్ చెయ్యడానికి అవకాశం ఉంటుంది అని ప్రశ్నించారు.. సూపర్, కామన్, ప్రీమియం, వెరైటీ రకాలలో వేటికి ఓపెన్ మార్కెట్ లో డిమాండ్ ఉందో గమనించాలన్నారు.
క్షేత్ర స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయండి
ధాన్యం సేకరణ విషయంలో ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారో లేదో క్షుణ్ణంగా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. షెడ్యూలింగ్ అనుసరించి కోతలు, ఆర్ ఎస్ కె కు తరలింపు , అక్కడ నుంచి మిల్లుకు వరకు పట్టే సమయపాలన ఖచ్చితంగా పాటించడం పై పర్యవేక్షణ, రికార్డులు నిర్వహణ లో శ్రద్ధ ఉండాలని, అప్పుడే ఎటువంటి అవకతవకలు లేకుండా సక్రమ నిర్వహణ సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రతికూల వార్తలు వచ్చాయి కనుక క్షేత్ర స్థాయి తనిఖీలు చేస్తామనే విధానం సరికాదని, తనిఖీలు నిరంతరం సాగాలని, తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి ధాన్యం సేకరణ సీజన్లో ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో ఆర్ ఎస్ కె తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, నియోజక వర్గ ప్రత్యేక అధికారులను ఒకొక్క నియోజకవర్గంకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని జాయింట్ కలెక్టర్ కు సూచించారు. ధాన్యం సేకరణ క్రమబద్ధీకరణ కోసం నిర్దిష్ట కార్యాచరణ ఉండాలన్నారు. జిల్లా సహకార అధికారుల ద్వారా రికార్డుల నిర్వహణ , షెడ్యూల్ , కేటాయింపు , కార్యాచరణ , అందుకు సంబంధించి ఏర్పాట్లు, ఈ క్రాప్ బుకింగ్, రవాణా, గన్ని బ్యాగులు , మిల్లర్, తదితర అంశాలపై తగిన దృష్టి సారించాలని కోరారు. ఆమేరకు నివేదిక అందచేయాలని ఆదేశించారు. రైతులకు మేలు చేసే క్రమంలో అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, ఇంచార్జీ జిల్లా పౌర సరఫరాల అధికారి ఎమ్. ప్రేమ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా సహకార అధికారి ఎమ్. జనార్ధన రెడ్డి, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, డిపిఆర్వో వై.బాలకృష్ణ, జిల్లా మేనేజర్ , లీగల్ మెట్రలాజి, టిసిఎస్, డి ఎస్ వో , శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


