ఐపీఎస్లు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలకు సీఐడీ నోటీసులు
మే 5న విచారణకు హాజరుకావాలని ఆదేశం
వీరి గత వాంగ్మూలాలకు, పీఎస్ఆర్ చెప్పిన విషయాలకు పొంతన లేదని భావిస్తున్న సీఐడీ
Trinethram News : నటి జత్వాని కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, గతంలో కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలు వెల్లడించిన కొన్ని అంశాలను ఆయన ఖండించినట్లు సమాచారం. ముఖ్యంగా, జత్వానీని ముంబై నుంచి తీసుకురావాలనే టాస్క్ను తనకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఆంజనేయులు అప్పగించారని గతంలో విశాల్ గున్ని సీఐడీకి తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను విశాల్ గున్నితో కేవలం నిఘా సంబంధిత విషయాలు మాత్రమే మాట్లాడి ఉంటానని… జత్వానీ విషయంపై విశాల్ గున్నితో కానీ, కాంతి రాణాతో కానీ తాను ఎలాంటి చర్చలు జరపలేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన విచారణలో స్పష్టం చేసినట్లు తెలిసింది.
గతంలో కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలను సీఐడీ అధికారులు ఇదే కేసులో ప్రశ్నించారు. తాజాగా పీఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన వాంగ్మూలంతో, ఈ ముగ్గురి కథనాల్లో పొంతన కుదరడం లేదని సీఐడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు, గత వాంగ్మూలాల్లోని అంశాలపై మరింత స్పష్టత కోసం కాంతి రాణా, విశాల్ గున్నిలను మరోసారి ప్రశ్నించాలని సీఐడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే వారికి మే 5న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ విచారణ అనంతరం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


