TRINETHRAM NEWS

ఏపీపై కాంగ్రెస్‌ స్పెషల్‌ ఫోకస్‌.. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో రెడీ వివిధ పార్టీ ల నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిక? స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కూతురు..వైస్ షర్మిల ను ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశాలు?

ఆంధ్రప్రదేశ్‌పై కాంగ్రెస్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. సభలు, సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్‌ నేతలు. తాజాగా.. ఢిల్లీలో జరిగిన సమావేశంలోనూ ఏపీ కాంగ్రెస్‌ నేతలకు కీలకాంశాలపై దిశానిర్ధేశం చేశారు ఏఐసీసీ అగ్ర నేతలు. ఇంతకీ.. ఏపీ కాంగ్రెస్‌ ముందున్న లక్ష్యమేంటి?.. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కొనబోతోంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఏపీలోనూ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్‌. వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని అడుగులు వేస్తోంది. దానికోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించింది కాంగ్రెస్‌ అధిష్టానం. తాజాగా.. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్‌ సమన్వయ భేటీ జరిగింది. ఈ సమావేశంలో.. రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, మాణిక్కం ఠాగూర్‌, ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, జేడీ శీలంతోపాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులు, చేరికలు, పార్టీ బలోపేతం, కాంగ్రెస్ గ్యారెంటీలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇక.. సంక్రాంతి పండుగ తర్వాత 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌కు రెడీ అవుతోంది ఏపీ కాంగ్రెస్‌.పార్టీ శ్రేణుల్లో జోస్ నింపేలా అంధ్రప్రదేశ్‌లో మూడు సభలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఆ సభలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకను ఏపీ పీసీసీ చీఫ్‌ రుద్రరాజు ఆహ్వానించారు. అమరావతి, ఉత్తరాంధ్ర, రాయలసీమను కవర్ చేసేలా సభలకు ప్లాన్‌ చేస్తున్నారు. దాంతోపాటు.. ఘర్‌ వాపసీ ద్వారా గతంలో పార్టీ వీడిన సీనియర్లను ఆహ్వానించబోతోంది. కీలక నేతలకు టచ్‌లోకి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఏపీలో 15శాతం ఓట్లు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్‌ నేత జేడీ శీలం. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్‌, ముస్లిం వర్గాలకు చేరువయ్యేందుకు త్వరలోనే ఏపీవ్యాప్తంగా యాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు

షర్మిల అంశంపైనా ఏఐసీసీ సమావేశంలో ఏపీ కాంగ్రెస్‌ నేతలను ఆరా తీశారు. అయితే.. షర్మిల చేరికకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు జేడీ శీలం. వైఎస్‌ కుటుంబంలో చిచ్చు పెట్టడం తమ ఉద్దేశం కాదని.. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యమన్నారు. ఇక.. షర్మిల చేరిక విషయంలో రాహుల్‌గాంధీ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నట్టు చెప్పారు జేడీ శీలం. ఇక.. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని సహా ఏడు గ్యారెంటీలతో ఏపీలో ప్రచారం చేస్తామన్నారు జేడీ శీలం. త్వరలోనే రాహుల్‌, ప్రియాంక కూడా సభలకు హాజరవుతారన్నారు. మొత్తంగా.. విభజన తర్వాత గత రెండు ఎన్నికల్లో డీలా పడ్డ ఏపీ కాంగ్రెస్.. వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. కర్నాటక, తెలంగాణ విజయాల ఉత్సాహంతో దూకుడు పెంచాలని డిసైడ్‌ అయింది. గ్యారెంటీలతో ప్రత్యర్థులకు గట్టి షాక్‌లు ఇస్తూ వస్తున్న కాంగ్రెస్‌.. ఏపీలోనూ అదే ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తోంది.