Currency Circulation : రూ.10తో పరేషాన్!…. మార్కెట్లో తగ్గిన నోటు చలామణి

TRINETHRAM NEWS

Pareshan with Rs.10!… Reduced currency circulation in the market

విపణిలో రూ.10 నోటు చలామణి తగ్గింది. వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దాల క్రితం సాధారణ కొనుగోలుకు 5, 10, 20, 25, 50 పైసల నాణేలు చలామణిలో ఉండేవి.

కాలక్రమేణా అవి కనుమరుగై రూపాయి ప్రామాణికంగా చలామణిలోకి వచ్చింది. క్రమంగా ధరల పెరుగుదల కారణంగా రూ.1, 2, 5ల నాణేలు ఉన్నా కొంతకాలంగా రూ.5లు, రూ.10లు ప్రామాణికంగా నడుస్తోంది. వ్యాపారులు ఏదైనా వస్తువు విలువ చెప్పేటప్పుడు రూ.5కు రెండు, రూ.10లకు మూడు అని చెబుతున్నారు.

దీంతో కిరాణ, ఫ్యాన్సీ, కూరగాయలు, ఇతర అన్ని సాధారణ వ్యాపారాల్లో రూ.10 ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం రూ.10ల నోటు విపణిలో అందుబాటులో లేక వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

పెరిగిన ఆన్‌లైన్‌ చెల్లింపులు

కరోనా తరువాత డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆన్‌లైన్‌ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. ఏ దుకాణానికి వెళ్లినా, ఏ వస్తువు కొనాలన్నా డిజిటల్‌ చెల్లింపులు పని చేస్తున్నాయా?

అనే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి చెల్లింపులకు ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి ప్రత్యేకంగా వ్యాలెట్‌ రూపంలో సులభతర చెల్లింపులు అనుమతిస్తున్నాయి. వీధి వ్యాపారులు, చిన్న దుకాణాల్లో సైతం డిజిటల్‌ చెల్లింపులు పెరిగిపోయాయి. దీంతో రూ.5, రూ.10ల లావాదేవీలకు కూడా వినియోగదారులు నోట్లు ఇవ్వడంలేదు.

క్రమంగా రూ.10ల నోటు బదలాయింపు జరగకపోవడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల వద్ద అందుబాటులో లేకుండా పోయింది. విపణిలో ప్రస్తుతం చిరిగిన రూ.10 నోట్లు దర్శనమిస్తుండటం గమనార్హం.

ఎక్కడ ఆగిందో?

రూ.10లు విపణిలో చలామణి తగ్గడంలో అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు సైతం ఈ పరిస్థితిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఎవరైనా వినియోగదారుడు చిరు వ్యాపారుల వద్ద ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు రూ.100ల నోటు ఇస్తే వ్యాపారులు తిరిగి ఇవ్వాల్సిన చిల్లరకు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో రూ.1, రూ.2ల చెల్లింపులకు బదులు చాక్లెటు, బిస్కెటు వంటివి ఇచ్చేవారు కానీ రూ.10లకు ఏమి ఇవ్వాలని వ్యాపారులు ఆలోచనలో పడ్డారు.

ఇస్తే వినియోగదారుడు ఎలా స్పందిస్తారనే ఆందోళన వారిలో ఉంది. భారీ మొత్తాల చెల్లింపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెద్ద మొత్తంలో లావాదేవీలకు డిజిటల్‌ చెల్లింపులు జరిగితే వినియోగదారులు, వ్యాపారులు పన్నుల పరిధిలోకి వస్తామని ఆందోళన చెందుతుండటమే ఈ పరిస్థితికి కారణం. చిన్న మొత్తాల చెల్లింపుల కారణంగా కొన్నిసార్లు యూపీఐ సర్వర్‌లపై భారం పడి పని చేయని పరిస్థితి నెలకొంటోందని వ్యాపారులు చెబుతున్నారు.

నోట్ల కొరత వాస్తవమే

  • శ్రీనివాసరెడ్డి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌

పది రూపాయల నోట్ల కొరత ఉన్న మాట వాస్తవమే. రిజర్వ్‌ బ్యాంకు నుంచి రావడం లేదు. ఇండెంట్ పెడితే రూ.20, 50, 100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. రూ.10ల నోట్లు రావడం లేదు. నాణేలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అవి చెల్లుబాటులో ఉన్నాయని ప్రజలు గమనించాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pareshan with Rs.10!… Reduced currency circulation in the market

You cannot copy content of this page

Scroll to Top